Stock market news in Telugu: యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్, అమెరికాలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు చేసిన కామెంటరీ చాలా కీలకంగా మారింది. అమెరికాలో వడ్డీ రేట్ల (Interest rates in US) పెంపు ఆగిపోయినట్లేనని, 2024లో మూడు రేట్‌ కట్స్‌ ఉండొచ్చని ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ (Fed Chair Jerome Powell) సిగ్నల్స్‌ ఇచ్చారు. దీంతోపాటు, అంచనా వేసిన సమయం కంటే ముందే 2% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకోవచ్చని కూడా సూచించారు. దీంతో, US స్టాక్‌ మార్కెట్లు భారీగా పెరిగాయి. వాటిని ట్రాక్‌ చేస్తూ, ఈ రోజు (గురువారం, 14 డిసెంబర్‌ 2023) ఇండియన్‌ ఐటీ స్టాక్స్‌ 11% వరకు జంప్‌ చేశాయి.


ఇండియన్‌ ఐటీ కంపెనీల బిజినెస్‌లో ఎక్కువ భాగం అమెరికాపైనే ఆధారపడి ఉంటుంది. మన ఐటీ కంపెనీల మొత్తం ఆదాయాల్లో, అమెరికా నుంచి వచ్చే రెవెన్యూదే పెద్ద పోర్షన్‌. అమెరికా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే, ఇండియన్‌ ఐటీ సెక్టార్‌ వర్ధిల్లుతుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడితే, సొట్ట ఇక్కడి కంపెనీలకు పడుతుంది.


అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, 2% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవచ్చన్న అంచనాలు మన ఐటీ సెక్టార్‌కు సూపర్‌ ట్రిగ్గర్స్‌. రుణ వ్యయాలు, ద్రవ్యోల్బణం తగ్గితే అమెరికన్‌ క్లైయింట్స్‌ చేసే ఐటీ కేటాయింపులు పెరుగుతాయి. భారతీయ ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు, ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టుల నంబర్‌ పెరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఆదాయ మార్గాలు మెరుగుపడే సిగ్నల్స్‌ వచ్చాయి కాబట్టి, ఈ న్యూస్‌ బయటకు రాగానే ఐటీ స్టాక్స్‌ తారాజువ్వల్లా ర్యాలీ చేశాయి.


నిఫ్టీ ఐటీ (Nifty IT Index) ప్యాక్‌లో ఎంఫసిస్ టాప్ గెయినర్‌గా ఉంది. ఇది, BSEలో 7% పైగా పెరిగింది, కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ. 2,619.60 (Mphasis share price today) చేరుకుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లోని మొత్తం 10 స్టాక్స్ ఈ రోజు పచ్చగా కళకళలాడాయి. మిడ్‌ క్యాప్ స్టాక్‌ కోఫోర్జ్ కూడా 5% పైగా పెరిగింది, BSEలో ఫ్రెష్‌గా 52 వారాల గరిష్ట స్థాయి (Coforge shares 52-week high) రూ. 6,201ని తాకింది.


నిఫ్టీ ఇండెక్స్‌లోని టాప్-5 గెయినర్స్‌ కూడా IT స్పేస్ నుంచే ఉన్నాయి. అవి... టెక్ మహీంద్ర, HCL టెక్‌, LTI మైండ్‌ట్రీ, విప్రో, ఇన్ఫోసిస్‌. చాలా ఐటీ షేర్లు 3-5% వరకు లాభపడ్డాయి. మిగిలిన ఐటీ కౌంటర్లలో... సొనాటా సాఫ్ట్‌వేర్, మాస్టెక్ కూడా కొత్తగా 52 వారాల గరిష్ట స్థాయిని క్రియేట్‌ చేశాయి. 


ఈ రోజు బ్యాంకింగ్‌ షేర్లు (Banking Shares) కూడా భారీగా లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్‌, బ్యాంక్ ఇండెక్స్‌ ‍‌డబుల్‌ ఇంజిన్లలా మారి హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లను వేగంగా పరుగులు పెట్టించాయి. 


బుధవారం, నాస్‌డాక్ కాంపోజిట్ 200.57 పాయింట్లు లేదా 1.38% లాభంతో 14,734 వద్ద ముగిసింది. డౌ జోన్స్‌ 1.40%, S&P 500 1.37% జంప్ చేశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: టాప్‌-10 హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ - 2023లో ఇవే హైలైట్‌