SBI Q1 Results: 


దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అదరగొట్టింది! జూన్‌ త్రైమాసికం ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను అధిగమించింది. వార్షిక ప్రాతిపదికన 178 శాతం వృద్ధితో రూ.16,884 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఎకనామిక్స్‌ టైమ్స్‌ పోల్‌ అంచనా వేసిన రూ.15,000 కోట్ల కన్నా ఇదెంతో ఎక్కువ. ఎస్బీఐకి నాలుగో త్రైమాసికం తర్వాత వచ్చిన అత్యధిక లాభం ఇదే కావడం విశేషం.


జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ నికర వడ్డీ (SBI Results) ఆదాయం వార్షిక ప్రాతిపదికన 24.7 శాతం పెరిగి రూ.38,905 కోట్లుగా నమోదైంది. ఇక స్థానిక నికర వడ్డీ మార్జిన్‌ 24 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగి 3.47 శాతానికి చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (SBI NPAs) త్రైమాసికం ప్రాతిపదికన 2.76 శాతం, వార్షిక ప్రాతిపదికన 3.9 శాతానికి తగ్గాయి. గణాంకాలతో సహా చెప్పాలంటే గతేడాది రూ.113,271 కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు ఇప్పుడు రూ.91,327 కోట్లకు తగ్గాయి. వార్షిక ప్రాదిపదికన ప్రావిజన్లు రూ.4,392 కోట్ల నుంచి రూ.2501 కోట్లకు తగ్గాయి. క్వార్టర్‌ ప్రాదిపదికన రూ.3500 కోట్లుగా ఉన్నాయి.


బేసెల్‌ త్రీ నిబంధనల ప్రకారం ఎస్బీఐ క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 14.68 శాతం నుంచి 14.56 శాతానికి చేరుకుంది. క్వార్టర్‌ బేసిస్‌లో ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ (SBI EPS) విలువ రూ.18.71 నుంచి రూ.18.92కు పెరిగింది. రిటర్న్‌ ఆన్ అసెట్స్‌ ఒక బేసిస్‌ పాయింట్‌ మేర తగ్గింది. ఈక్విటీతో పోలిస్తే అప్పుల నిష్పత్తి 0.66 నుంచి 0.64 శాతానికి తగ్గింది. ఇక క్రెడిట్‌ గ్రోత్‌ వార్షిక ప్రాతిపదికన 13.90 శాతంగా ఉంది. స్థానిక రుణాలు 15.08 శాతానికి పెరిగాయి. వాహన రుణాలు రూ.లక్ష కోట్ల మేర పెరగ్గా, వ్యవసాయ రుణాలు 14.84 శాతం, కార్పొరేట్‌ రుణాలు 12.38 శాతం పెరిగాయి.


చిన్న, మధ్య స్థాయి కంపెనీల రుణాల 18.27 శాతం, రిటైల్‌ పర్సనల్‌ లోన్లు 16.46 శాతం పెరగడంతో స్థానిక రుణాల వద్ధిరేటు పెరిగింది. ఈ త్రైమాసికంలో క్రెడిట్‌ కాస్ట్‌ 29 బేసిస్‌ పాయింట్ల మేర మెరుగై 0.32 శాతానికి చేరుకుంది. క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో 113 బేసిస్‌ పాయింట్లు పెరిగి 14.56 శాతంగా ఉంది.


జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని ఎస్బీఐ తెలిపింది. స్థూల అప్పులు స్థాయి పెరగడం, స్థూల నిరర్థక ఆస్తులు 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గడంతో ఆస్తుల నాణ్యత మెరుగైందని వెల్లడించింది. బ్యాంకు మెరుగైన ఫలితాలే విడుదల చేసినప్పటికీ శుక్రవారం మూడు గంటలకు షేర్లు 15 రూపాయల నష్టంతో 574 వద్ద ట్రేడవుతున్నాయి.


Also Read: మీకు రూ.15,490 రీఫండ్‌ వస్తోంది! ఆ మెసేజ్‌ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.