Russia Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఎల్‌ఐసీ ఐపీవోపై పడినట్టే కనిపిస్తోంది. అతి పెద్ద జీవిత బీమా సంస్థ పబ్లిక్‌ ఇష్యూ ఎంట్రీ సమయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి సమీక్షించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.


'పూర్తిగా భారత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మేం ఈ ఐపీవో ప్రణాళికను రూపొందించుకున్నాం. నిజానికి మేం దీని ప్రకారమే ముందుకెళ్లాలి. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితులను మరోసారి సమీక్షించాలని సూచిస్తుంటే మేం అందుకు సిద్ధమే. మాకేమీ ఇబ్బంది లేదు' అని నిర్మలా సీతారామన్‌ బిజినెస్‌ లైన్‌ ఇంటర్వ్యూలో చెప్పారని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.


ఎల్‌ఐసీ దాదాపుగా 10.4 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపుగా రూ.70వేల కోట్లకు పైగా విలువతో ఐపీవోకు రావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2022, మార్చి 31లోగా ఈ పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం ద్వారా బడ్జెట్‌ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. కానీ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వల్ల సమీక్షిస్తే ఐపీవో సమయం మారొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఫిబ్రవరి 13న ఎల్‌ఐసీ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. కంపెనీ విలువను రూ.5.4 లక్షల కోట్లుగా చూపించింది.


ఐపీవో మరికాస్త ఆలస్యమైతే ప్రభుత్వ వార్షిక డిస్‌ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలపై ప్రభావం పడుతుందా అని ప్రశ్నించగా 'ఒక ప్రైవేటు రంగ ప్రమోటర్‌ తేదీపై నిర్ణయం తీసుకుంటే ఆ కంపెనీ బోర్డుకు చెబితే సరిపోతుంది' అని నిర్మల అన్నారు. 'కానీ నేను మాత్రం మొత్తం ప్రపంచానికి వివరించాల్సి ఉంటుంది' అని ఆమె పేర్కొన్నారు.


ఎల్‌సీఐలోని 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఈ మధ్యే అనుమతి ఇచ్చింది. మొత్తంగా కంపెనీలో 5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐపీవో నేపథ్యంలో కస్టమర్లకు కొన్ని ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది.