Retail inflation: దేశంలో ధరలు మళ్లీ పెరిగాయి, చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) పరుగులు పెట్టింది. 2023 జనవరిలో, వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index) ఆధారిత ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగింది, మరోసారి 6 శాతాన్ని దాటాడమే కాకుండా ఏకంగా ఆరున్నర శాతం పైగా నమోదైంది.             


2023 జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరుకుంది. 2022 డిసెంబర్‌ నెలలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంగా ఉంది. 2022 జనవరి జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతంగా ఉంది. అంటే, అంతకముందు నెల డిసెంబర్‌తో పోల్చినా, గత ఏడాది జనవరితో పోల్చినా ఈ ఏడాది జనవరి నెలలో ద్రవ్యోల్బణం హై రేంజ్‌లో ఉంది. దీని అర్ధం, జనవరిలో ధరలు జనం నెత్తి మీదకెక్కి తైతక్కలాడాయి.


రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు          
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను పరిశీలిస్తే... 2022 డిసెంబర్‌ నెలలో 4.19 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2023 జనవరి నెలలో 5.94 శాతానికి చేరుకుంది. అంటే, జనవరిలో ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. 


పాలు, పాల ఉత్పత్తులు ప్రధాన కారణం            
జనవరి 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల మీద, పెరిగిన పాల ధరల ప్రభావం ప్రధానంగా కనిపిస్తోంది. పాలు, వాటి నుంచి తయారయ్యే పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జనవరిలో 8.79 శాతంగా ఉంది. సుగంధ ద్రవ్యాలు కూడా ఖరీదైనవిగా మారాయి, వాటి ద్రవ్యోల్బణం రేటు 21.09 శాతంగా ఉంది. తృణధాన్యాలు, ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 16.12 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరల ద్రవ్యోల్బణం 6.04 శాతంగా ఉండగా, గుడ్ల విషయానికి వచ్చేసరికి ఇది 8.78 శాతంగా నమోదైంది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం ప్రతికూలంగా, మైనస్‌ 11.70 శాతంగా ఉంది. పండ్ల ద్రవ్యోల్బణం 2.93 శాతంగా ఉంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 4.27 శాతంగా ఉంది.


వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం       
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం సామాన్యుడి పాలిట ప్రమాద ఘంటిక. అంతకు ముందు, 2022 నవంబర్ & డిసెంబర్ నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) టాలరెన్స్ అప్పర్‌ బ్యాండ్ అయిన 6 శాతం కంటే తక్కువే నమోదైంది. 2023 ఫిబ్రవరి 8న, రెపో రేటును 0.25 శాతం లేదా 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన RBI, మొత్తం రెపో రేటును 6.50 శాతానికి చేర్చింది. నవంబర్‌, డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది కాబట్టి, జనవరిలోనూ తగ్గవచ్చన్న అంచనాలు ఇప్పుడు ఛిన్నాభిన్నం అయ్యాయి. పైగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం టాలరెన్స్‌ బ్యాండ్‌ను దాటి 6.52 శాతానికి చేరింది. దీనిని మళ్లీ కిందకు దించడానికి కఠిన వైఖరిని ఆర్‌బీఐ కొనసాగించవచ్చు. ఫైనల్‌గా, వడ్డీ రేట్ల పెంపు ఇకపైనా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా ఇప్పటికే తీసుకున్న, ఇకపై తీసుకోనున్న రుణ రేట్లు మరింత పెరుగుతాయి.


2023 ఏప్రిల్‌ నెలలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం (MPC) జరగనుంది. ఆ సమీక్షలో రెపో రేటుపై నిర్ణయం తీసుకుంటారు.