RBI MPC Meeting: ప్రతి ఒక్కరికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అదే సమయంలో, వాటి వల్ల చాలాసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ ఏదైనా సేవను అందించడానికి నిరాకరిస్తే లేదా ఇబ్బంది పెడితే... దానికి సంబంధించి కంప్లైంట్‌ చేయడానికి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. తాజాగా, కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియను మరింత సరళంగా మారుస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ మార్పుల తర్వాత కస్టమర్‌ సమస్యలు వేగంగా, సులువుగా పరిష్కారం అవుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. 


ఈ రోజు (శుక్రవారం, 06 అక్టోబర్‌ 2023), ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును స్థిరంగా, 6.50% వద్దే ఉంచుతున్నామని చెప్పారు. బ్యాంకింగ్‌ సర్వీసుల విషయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను MPC దృష్టికి వచ్చాయని, మీటింగ్‌లో డిస్కషన్‌ జరిగిందని చెప్పారు. ఆ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, బ్యాంకింగ్‌ ఛానల్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు, వారు చేసే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పారు. 


ప్రస్తుతం అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ ఇలా ఉంది
ప్రస్తుతం, బ్యాంక్‌ కస్టమర్‌ చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ (ombudsman scheme) అమల్లో ఉంది. దీని కింద రెండు ఛానెల్స్ ఉన్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఒక ఛానెల్ ఉంది, దీనిని ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అంటారు. రెండో ఛానెల్ రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ పథకం. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), ప్రీపెయిడ్ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ‍‌(PPIలు), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ‍‌(CICలు) ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ ప్రకారం పని చేస్తాయి. వీటి పరిధి తర్వాత, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.


అంబుడ్స్‌మన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఈ మార్పులు
ప్రస్తుత వ్యవస్థలో, అన్ని రకాల ఆర్థిక సంస్థల్లో ఇంటర్నల్‌ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ విధివిధానాలు ఒకే విధంగా లేవు. బ్యాంకులు, NBFCలు, PPIలు, CIC వంటి వాటికి ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలు భిన్నంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ఈ మార్గదర్శకాల ఫీచర్స్‌ ఒకేలా ఉన్నప్పటికీ, అవి విభిన్నంగా ఉన్నాయని వివరించారు. ఇప్పుడు, ఆ మార్గదర్శకాలను అన్ని రకాల ఆర్థిక సంస్థలకు ఏకరీతిలో ఉండేలా రూపొందించాలని RBI MPC మీటింగ్‌లో నిర్ణయించారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కస్టమర్ చేసే ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది.


పట్టణ సహకార సంఘాలకు బహుమతి
బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మరో ముఖ్యమైన ప్రకటన చేసింది. ఎంపిక చేసిన అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు బుల్లెట్ రీపేమెంట్ పథకం కింద 'బంగారంపై రుణ పరిమితి'ని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు గవర్నర్ దాస్ తెలిపారు. మార్చి 31, 2023 నాటికి ప్రాధాన్యత రంగానికి ఇచ్చే రుణ లక్ష్యాన్ని పూర్తి చేసిన పట్టణ సహకార బ్యాంకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, వివిధ రంగాలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ప్రోత్సాహం ఇస్తోంది.


మరో ఆసక్తికర కథనం: ఈసారి పండుగ సంబరం మరింత భారం, సరుకుల రేట్లు తగ్గే ఛాన్స్‌ లేదంటున్న ఆర్‌బీఐ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial