Price Rise: 


టమాట, అల్లం, పచ్చిమిర్చి, వంకాయలు, నువ్వుల వంటి నిత్యావసరాల ధరల పెరుగుదలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఆహార పదార్థాల ఒత్తిడి ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలూ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పట్లో ధరాభారం నుంచి సామాన్యులకు ఉపశమనం దొరకదని తెలిసింది.


దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు వారం రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వేసవి కాలంలో వేడిగాలులు, వర్షాలు సకాలంలో రాకపోవడంతోనే కూరగాయాల దిగుబడి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక ఆర్థిక సమీక్ష పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది.


ఒకవేళ ధరలు పెరుగుదల ఇలాగే ఉంటే వడ్డీరేట్లు తగ్గించాలన్న ఆర్బీఐ ఆశలకు కళ్లె పడినట్టేనని మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన మే నెలలో ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ఠమైన 4.25 శాతానికి చేరుకుంది. తగ్గిన ద్రవ్యోల్బణం గణాంకాలు ధరల పెరుగుదలను ఇంకా ప్రతిబింబించలేదు. అయితే హోల్‌సేల్‌, రిటైల్‌ గణాంకాల మధ్య చాలా అంతరం కనిపిస్తోంది. మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.48 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. నూనెలు, ప్రాథమిక లోహాలు, క్రూడ్‌ ప్రెట్రోలియం, సహజ వాయువు ధరల తగ్గుదలతో ఇది సాధ్యమైంది.


భారత్‌ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. అందుకే ఎల్‌నినో ప్రభావం మార్కెట్లను ఆందోళనలోకి నెట్టేస్తోంది. భౌగోళిక రాజకీయ సమస్యలు, ఎల్‌నినో ప్రభావం 2024 ఆర్థిక ఏడాది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఒడుదొడుకులు, గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లలో ప్రైస్‌ కరెక్షన్‌, ఎల్‌నినో ప్రభావం, వాణిజ్యం తగ్గడం వంటివి ఇందుకు కారణమవుతాయి. దాంతో కందిపప్పు, మినప పప్పు, గోధుమలు, చక్కెర ఎగుమతులపై 2024 ఆగస్టు వరకు పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది.


Also Read:  ఈఎంఐ భారం పెంచనున్న టమాట! ఆర్బీఐపై 'కూరగాయాల' ప్రెజర్‌!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial