Petrol - Diesel Price: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరాభారాన్ని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేనట్టే కనిపిస్తోంది! చమురుపై వేస్తున్న పన్నులను వెంటనే  తగ్గించేందుకు సర్కారు మొగ్గు చూపడం లేదని తెలిసింది. ఈ భారాన్ని తగ్గించేందుకు చమురు కంపెనీలే ఏదైనా చేయాలని సూచిస్తోందట. వినియోగదారులపై భారం పెరగకుండా కంపెనీలే మేనేజ్‌ చేయాలని వెల్లడించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.


పెట్రోల్‌, డీజిల్‌పై అమలు చేస్తున్న పన్నులు, సుంకాలను తగ్గించాలని పెట్రోలియం మినిస్ట్రీ చేసిన ప్రతిపాదనకు ఫైనాన్స్‌ మినిస్ట్రీ ఆసక్తి చూపించలేదని తెలిసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమరు ధరలు, పరిస్థితిని హ్యాండిల్‌ చేయడంపై ఈ మధ్యే ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ చమురు కంపెనీల అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఇంధనంపై వేస్తున్న సుంకాలను తగ్గించాలన్న ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు అంగీకరించలేదని ఒకరు తెలిపారు. పెరుగుతున్న ధరల వ్యవహారాన్ని చమురు కంపెనీలే డీల్‌ చేయాలని చెప్పినట్టు సమాచారం.


దీపావళి నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించడంతో వినియోగదారులు కాస్త రిలాక్స్‌గా ఫీలయ్యారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం రావడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఇంధనం ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ ధరలతో డొమస్టిక్‌ ధరలను పోలిస్తే పెట్రోలు మధ్య రూ.8, డీజిల్‌కు రూ.18 వరకు అంతరం ఉంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.119, డీజిల్‌ రూ.105గా ఉంది.


సుంకాలతో షాక్‌!


పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకంతో పాటు రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను వేయడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రెండు టాక్సులు కలిపి పెట్రోలుపై 42 శాతం, డీజిల్‌పై 37 శాతం ఉంటున్నాయి. 2014, ఏప్రిల్‌లో ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోలుపై రూ.9.48గా ఉండగా ఈ ఎనిమిదేళ్లలో దానిని రూ.27.9కి పెంచారు. ఇక డీజిల్‌పై రూ.3.18 నుంచి రూ.21కు పెంచారు. 2020 ఆర్థిక ఏడాదిలో చమురు ధరలపై వేసిన సుంకం ద్వారా కేంద్రానికి రూ.1.78 లక్షల కోట్లు రాగా రూ.3.70 లక్షల కోట్లకు పెరిగింది.


Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇంటి రుణం వడ్డీరేట్లు తగ్గించిన కేంద్రం


Also Read: వాట్సాప్‌ యూపీఐ వాడుతున్నారా? ఈ అప్‌డేట్‌ మీకోసమే!


Also Read: ట్విటర్‌కు ఎలన్‌ మస్క్‌ బంపర్ ఆఫర్‌! మొత్తం కొనేస్తానంటూ బేరాలు!