PM Surya Ghar Muft Bijli Yojna Details In Telugu: వేసవిలో ఇంటి చల్లగా ఉంచుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడడం సర్వసాధారణం. ఈ యంత్రాలు పని చేస్తున్నంత సేపే ఇల్లు చల్లగా ఉంటుంది, తర్వాత మళ్లీ మంట పుడుతుంది. ఆ సెగలకు తట్టుకోలేక రోజంతా ఏసీలు, కూలర్లు రన్ చేస్తూనే ఉంటారు. నెల తర్వాత వచ్చే కరెంటు బిల్లును చూశాక, వేసవి అసలైన వేడి తెలుస్తుంది. అయితే, ఏసీ & కూలర్ వంటివి ఎక్కువగా వాడినా ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు రాని చిట్కా ఒకటి ఉంది. వాస్తవానికి అది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం, దాని పేరు "ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన".
కరెంటు బిల్లుల నుంచి విముక్తి దొరకడంతో, పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజనకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించారు. 10 మార్చి 2025 నాటికి, అంటే కేవలం 13 నెలల కాలంలోనే ఇది 10 లక్షలకు పైగా ఇన్స్టాలేషన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 10.09 లక్షల ఇళ్లలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యం
సౌరశక్తిని ఉపయోగించి కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించడం ఈ ప్రభుత్వ పథకం లక్ష్యం. ఇది, సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు తగ్గుతాయి & పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన కింద, ఇళ్లలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటి వరకు 47.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6.13 లక్షల మంది లబ్ధిదారులు ఇప్పటికే రూ. 4,770 కోట్ల సబ్సిడీని పొందారు.
రూ. 78,000 వరకు రాయితీ
ఈ పథకంలో భాగంగా, ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసే సౌర ఫలకాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ కరెంటును ఇంటి కోసం వినియోగించుకోవచ్చు. డిస్కమ్ నుంచి విద్యుత్ తీసుకోరు కాబట్టి కరెంటు బిల్లు రాదు. ఈ స్కీమ్లో, పైకప్పు సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. 1 కిలోవాట్కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు రూ.78,000 సబ్సిడీ వస్తుంది. సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి 1 కిలోవాట్కు దాదాపు రూ. 90 వేలు, 2 కిలోవాట్లకు దాదాపు రూ. 1.50 లక్షలు, 3 కిలోవాట్లకు దాదాపు రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది.
ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్యానెళ్ల ఏర్పాటు ఖర్చును కొంతవరకు తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్యానెళ్లను ఇన్స్టాల్ చేయడానికి దాదాపు 7% వడ్డీ రేటుతో బ్యాంక్ లోన్ కూడా లభిస్తుంది. మీ ఇంటి సోలార్ ప్యానెళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ మీ ఇంటి అవసరాలకు సరిపోగా ఇంకా మిగిలితే, అదనపు విద్యుత్తును అమ్మి డబ్బు సంపాదించవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పీఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిలి యోజన కోసం www.pmsuryaghar.gov.in పోర్టల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) నిర్వహిస్తుండగా, అమలు చేయడంలో విద్యుత్ సంస్థలు (DISCOMs) సాయం చేస్తున్నాయి.
ముందుగా, pmsuryaghar.gov.in పోర్టల్కి వెళ్లి మీ రాష్ట్రం, విద్యుత్ సంస్థ పేరును ఎంచుకోండి.
రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీని నమోదు చేయండి.
లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్ నింపి సమర్పించండి.
దరఖాస్తు తర్వాత, విద్యుత్ సంస్థ సిబ్బంది తనిఖీ కోసం మీ ఇంటికి వస్తారు. వాళ్ల ఆమోదం పొందిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ సెల్లర్ ద్వారా సౌర ఫలకాలను ఏర్పాటు చేయాలి.
దీంతో పాటు, నెట్ మీటర్ కూడా ఏర్పాటు చేయాలి.
ఇప్పుడు డిస్కమ్ తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత, కమీషనింగ్ సర్టిఫికేట్ పోర్టల్ నుంచి జనరేట్ అవుతుంది.
కమీషనింగ్ సర్టిఫికెట్ అందిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతా వివరాలను, రద్దు చేసిన చెక్కును అదే పోర్టల్ ద్వారా సమర్పించాలి.
సబ్సిడీ మొత్తం 30 రోజుల లోగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.