రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం స్టాక్‌ మార్కెట్లలో ఒక్కసారిగా అలజడి రేపింది. ఆసియా, ఐరోపా, భారత స్టాక్‌ మార్కెట్లు ఈ ఒక్క రోజే 5 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇక మాస్కో స్టాక్‌ మార్కెటైతే ఏకంగా 45 శాతం వరకు పతనమైంది. యుద్ధం ఎన్ని రోజులుంటుందో తెలియని నేపథ్యంలో ఇక ముందు ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టీ సూచీ ఎలా ప్రవర్తించనుంది?


ప్రశాంతతే ముఖ్యం


యుద్ధాలు ఎదురైనప్పుడు స్టాక్‌ మార్కెట్లు (Stock markets) ఒక్కసారిగా విపరీతంగా స్పందిస్తుంటాయి. తీవ్రమైన ఒడుదొడుకులకు లోనవుతాయి. ఎందుకంటే యుద్ధ భయంతో మదుపర్లు తమ పెట్టుబడులను ఒక్కసారిగా వెనక్కి తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. మార్కెట్లో అంతా విక్రయస్థులే ఉండటంతో షేర్ల ధరలు పతనమవుతాయి. ఇలాంటి సమయంలోనే కొందరు ప్రశాంతంగా ఉంటారు. తమ నష్టభయాన్ని గణించుకొని అనుగుణంగా స్పందిస్తుంటారు.


కార్గిల్‌ చూశాం


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని చూసి భయపడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. గతంలోనూ భారత స్టాక్‌ మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల్లో మెరుగ్గా ప్రవర్తించినట్టు గుర్తు చేస్తున్నారు. పైగా మనం కార్గిల్‌ యుద్ధ పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించామని అంటున్నారు. ఆ యుద్ధ భయాలను మన మార్కెట్లు త్వరగానే అధిగమించాయని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బహుశా మరో వెయ్యి పాయింట్లు పతనమైతే కావొచ్చని అంచనా వేస్తున్నారు. లేదంటే పుంజుకొనే అవకాశం ఉంటుందన్నారు. యుద్ధం మొదలై ఒక్కరోజే అయింది కాబట్టి ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. 15500-16000 మధ్య ఎక్కడైనా సపోర్ట్‌ తీసుకోవచ్చంటున్నారు.


నిఫ్టీ పరుగులే


సెప్టెంబర్‌ 11 దాడులు, ఇరాన్‌-కువైట్‌ యుద్ధం, రష్యా-అఫ్గాన్‌ యుద్ధం, కొరియా యుద్ధం, పెర్ల్‌ హార్బర్‌ దాడి, ఫ్రాన్స్‌-జర్మనీ యుద్ధాల సమయంలో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో డో జోన్స్‌తో పోలిస్తే నిఫ్టీ మరింత మెరుగ్గా రాణించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇలాంటి ఈవెంట్ల తర్వాత డోజోన్స్‌ 3, 6, 12 నెలల తర్వాత వరుసగా 7.3, 11.6, 11.5 శాతం రాబడి ఇచ్చింది. నిఫ్టీ మాత్రం వరుసగా 23, 34, 13 శాతం రాబడి ఇవ్వడం గమనార్హం.


కొత్తవాళ్లు దూరంగా


యుద్ధ పరిస్థితుల్లో కొత్త ఇన్వెస్టర్లు మరో రెండు వారాల వరకు స్టాక్‌ మార్కెట్ల జోలికి రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాయో తెలియదని అంటున్నారు. అనుభవం లేకుండా డబ్బులు పెడితే క్షణాల్లో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి కొత్త ఇన్వెస్టర్లు, డ్రేడర్లు ఈ పరిస్థితి దూరంగా ఉంటూనే గమనిస్తే బెటర్‌.


ఫండమెంటల్స్‌ చూశాకే


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లపై పెట్టుబడులు పెట్టొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే వాటి ఫండమెంటల్స్‌ను పూర్తిగా విశ్లేషించాకే నిర్ణయం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండే ఇన్వెస్టర్లే పతనమైనప్పుడు పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు రాణిస్తుంటాయి. అలాంటి వాటిని గుర్తించి పెట్టుబడి పెట్టొచ్చని అంటున్నారు.