​IT stocks:


గతేడాది ఐటీ స్టాక్స్‌ పేరు చెబితే ఇన్వెస్టర్లు గడగడా వణికిపోయారు! విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో నిఫ్టీ ఐటీ సూచీ 26 శాతం మేర పతనమైంది. కొన్ని నెలలుగా అండర్‌ పెర్ఫార్మర్‌గా ఉన్న ఈ ఇండెక్స్‌ నెల రోజులుగా కళకళలాడుతోంది. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ ఫ్లాట్‌గా చలిస్తుంటే ఐటీ మాత్రం 10 శాతం పెరిగి ఆశలు రేపుతోంది. దాంతో మదుపర్లు ఈ రంగం షేర్ల కోసం ఎగబడుతున్నారు.


అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడంతో ఎఫ్‌ఐఐలు స్థానిక బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికీ వెనక్కి రావడం లేదు. అయినప్పటికీ ఐటీ స్టాక్స్‌ తిరిగి పుంజుకోవడం ప్రత్యేకం. ఈ రంగంలో డిసెంబర్లో రూ.3500 కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జనవరిలో మరో రూ.2100 కోట్లు విత్‌డ్రా చేశారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, వాల్యూ బయ్యర్స్‌ కొనుగోళ్లు చేపట్టడంతో ఐటీ స్టాక్స్‌ దుమ్మురేపుతున్నాయి.


గత నెల్లో మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్‌ షేరు 25 శాతం పెరిగింది. 10 శాతం ఎగిసి కోఫోర్జ్‌ రెండో స్థానంలో ఉంది. మేజర్‌ టెక్‌ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 8 శాతం వరకు రాణించాయి. ఐటీ స్టాక్స్‌ ర్యాలీ వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.


అమెరికా, భారత ఐటీ షేర్లకు పరస్పర సంబంధం ఉంది. నాస్‌డాక్‌లో ఐటీ షేర్లు పడిపోతే నిఫ్టీ ఐటీలోని షేర్లూ కుదేలవుతాయి. కొన్ని నెలలుగా అమెరికా టెక్‌ కంపెనీల షేర్లు పాతాళానికి చేరాయి. ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నాయి. మెటా 44 శాతం, టెస్లా 60 శాతం ర్యాలీ అయ్యాయి. ఫలితంగా ఇక్కడా పేటీఎం, నైకా, జొమాటో వంటి టెక్‌ కంపెనీల షేర్లూ పెరుగుతున్నాయి.


ద్రవ్యోల్బణం పరిస్థితుల్లోనూ భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మెరుగైన ఫలితాలనే విడుదల చేస్తున్నాయి. ఖర్చులు పెరిగినప్పటికీ నిర్వాహక సామర్థ్యం పెంచుకున్నాయి. అంచనాలను మించే లాభాలు అందుకుంటున్నాయి. అన్ని కంపెనీలు ఎబిటా గ్రోత్‌ నమోదు చేస్తున్నాయి.


లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు మళ్లీ ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుతుండటం, కంపెనీలు తిరిగి ఆర్డర్లు సొంతం చేసుకోవడంతో మదుపర్లు వీటిపై ఆసక్తిగా ఉన్నారు. ఎంఫాసిస్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌టీటీఎస్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి కంపెనీల షేర్లు ఇప్పటికీ 52 వారాల గరిష్ఠానికి 30 శాతం నష్టాల్లోనే ఉన్నాయి. ఇక ఇంతకన్నా పడిపోయేందుకు ఆస్కారం లేదు. అందుకే బాటమ్‌ ఫిషింగ్‌ చేస్తున్నారు.


ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుతున్నాయని బ్లాక్‌రాక్‌, వెల్స్‌ఫార్గో, న్యూబర్గర్‌ బెర్మన్‌ వంటి బ్యాంకులు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ భయం ఉన్నా తీవ్రత మాత్రం అంతగా లేదంటున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే ఐటీ షేర్లు పరుగులు పెడతాయి. ఈ నేపథ్యంలో పర్సిస్టెంట్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, కోఫోర్జ్‌, ఎల్‌టీటీఎస్‌, బిర్లాసాఫ్ట్‌, మాస్టెక్‌ వంటి కంపెనీలను బ్రోకరేజీ సంస్థలు సిఫారసు చేస్తున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.