New Income Tax Slabs Structure 2025: ఆర్థిక సంవత్సరం 2025-26 ‍‌(FY 2025-26) నుంచి, కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు వ్యక్తుల ఆదాయం పన్ను రహితం అని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ (Standard deduction) రూ. 75,000 కూడా కలిపితే, రూ. 12,75,000 వరకు ఆదాయానికి టాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. అయితే, మీరు మరో లక్ష రూపాయలు ఎక్కువ సంపాదించినప్పటికీ ఒక్క పైసా కూడా పన్ను చెల్లించకుండా పూర్తి ఆదాయానికి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, మీరు రూ. 13 లక్షల 70 వేల వరకు ఆదాయంపైనా 'జీరో టాక్స్‌ లేదా నిల్‌ టాక్స్‌' (Zero Tax or Nil Tax) బెనిఫిట్‌ పొందొచ్చు. దీనికోసం, మీరు కొంత పెట్టుబడి పెట్టాలి. ఇది మీకు పన్ను ఆదా చేయడమే కాదు, భారీ మొత్తంలో వడ్డీ ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఆ డబ్బు మీ వృద్ధాప్యంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు మీ బుట్టలో పడతాయి. 


రూ. 13.70 లక్షల ఆదాయంపై పన్ను ఆదా చేసే లెక్క ఇదీ..
మీరు, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా 13 లక్షల 70 వేల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చు. మీరు జీతం తీసుకునే ఉద్యోగి అయితే, మీ ప్రాథమిక జీతం (Basic Pay)లో 14 శాతం మొత్తాన్ని ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు.. మీ జీతం రూ. 13 లక్షల 70 వేలు అనుకుందాం. దీని మూల వేతనం (బేసిక్‌ పే) రూ. 6 లక్షల 85 వేల వరకు ఉంటుంది. 6 లక్షల 85 వేల రూపాయలలో 14 శాతం అంటే 95,900 రూపాయలు అవుతుంది. ఈ డబ్బును నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (జాతీయ పింఛను పథకం)లో జమ చేయండి. ఇప్పుడు, మీ ఆదాయానికి రూ. 75,000 ప్రామాణిక తగ్గింపును కూడా జోడించండి. ఇప్పుడు, NPSలో జమ చేసిన మొత్తం + ప్రామాణిక తగ్గింపు (95,900 + 75,000) కలిపితే మొత్తం రూ. 1,70,900 రూపాయలు అవుతుంది, ఈ మొత్తానికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. మీ మొత్తం వార్షిక ఆదాయం రూ.13.70 లక్షల నుంచి రూ.1,70,900 తీసేస్తే రూ. 11,99,100 వస్తుంది. ఇది రూ. 12 లక్షల కంటే తక్కువ ఆదాయం. కొత్త ఆదాయ పన్ను స్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం, వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను లేదు. అంటే, మీరు పైసా కూడా పన్ను కట్టక్కర్లేదు, ఈ విధంగా, మీరు ఏడాదికి రూ.13.70 లక్షల వరకు సంపాదించినప్పటికీ, మొత్తం ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, కొత్త ఆదాయ పన్ను స్లాబ్‌ సిస్టమ్‌ 01 ఏప్రిల్‌ 2025 నుంచి అమల్లోకి వస్తుంది.


యాజమాన్యాన్ని బట్టి పన్ను ప్రయోజనాలు
రూ. 13 లక్షల 70 వేల వరకు వార్షిక ఆదాయంపై పన్ను భారం నుంచి బయటపడటం అంత సులభం కాదు. కంపెనీ ఖర్చుల్లో భాగంగా, యాజమాన్యం NPS ప్రయోజనాలను అందించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సిబ్బంది దీనిని స్వయంగా ఎంచుకోలేరు. NPS దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ, ఇప్పటి వరకు, కేవలం 22 లక్షల మంది పన్ను చెల్లింపుదారులే దీనిలో పెట్టుబడి పెట్టారు.


మరో ఆసక్తికర కథనం: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!