Minimum Deposit For PPF, SSY Account: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదార్లకు కీలక అప్‌డేట్‌. మీకు వీటిలో ఏదైనా ఖాతా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా అందులో డబ్బు డిపాజిట్ చేయకపోతే, జరిమానా పరిధిలోకి మీరు రావచ్చు. మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచడానికి మార్చి 31 వరకు మాత్రమే సమయం ఉంది. కనీస డిపాజిట్ చేయడం మిస్ అయితే మీ ఖాతాను నిలిపేస్తారు. జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, పన్ను ఆదాను (Income tax saving) కూడా మీరు కోల్పోవచ్చు.


పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై ఖాతాల్లో కనీస డిపాజిట్‌ కోసం చివరి తేదీ మార్చి 31. అంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చివరి తేదీ 2024 మార్చి 31. 


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాలో కనీస పెట్టుబడి        
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం, PPF ఖాతాదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరం ఖాతాలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఆ ఖాతాను నిలిపేస్తారు. ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా మారితే, రుణం (Loan) & పాక్షిక ఉపసంహరణ (Partial withdrawal) సౌకర్యం రద్దవుతుంది. అలాంటి ఖాతాను పూర్తిగా క్లోజ్‌ చేయకుండా మీరు మీ పేరు మీద మరో అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు. ఈ రిస్క్‌ ఎందుకు అనుకుంటే.. ఇన్‌-యాక్టివ్‌గా మోడ్‌లో ఉన్న PPF ఖాతాను తిరిగి యాక్టివేట్‌ చేయవచ్చు. దీని కోసం సంవత్సరానికి రూ.50 జరిమానా చెల్లించాలి. జరిమానాతో పాటు, వార్షిక కనీస డిపాజిట్‌ రూ.500 కూడా డిపాజిట్ చేయాలి. అంటే.. పీపీఎఫ్‌ ఖాతాను తిరిగి పని చేయించడానికి, ఎన్నేళ్లు ఆ అకౌంట్‌ నిద్రాణ స్థితిలో ఉంటే అన్ని 550 రూపాయలు చెల్లించాలి.


మరో ఆసక్తికర కథనం: దేశంలో 2జీ, 3జీ సేవలు నిలిపేస్తారా, ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల గతేంకాను? 


సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీస పెట్టుబడి
సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉంటే, ప్రతి సంవత్సరం కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే, ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి తెరవాలంటే ఏడాదికి చొప్పున రూ.50 జరిమానా చెల్లించాలి. దీంతోపాటు ఏడాదికి కనీసం రూ.250 చొప్పున డిపాజిట్ చేయాలి. SSY అకౌంట్‌ ఎన్ని సంవత్సరాలు డిఫాల్ట్‌ అయితే, అన్ని 300 రూపాయలు (రూ.50 + రూ.250) కట్టాలి.


పన్ను ఆదా ప్రయోజనం
మీరు పన్ను చెల్లింపుదారు (Taxpayer) అయితే.. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, PPF, సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31 లోపు పెట్టుబడి పెట్టాలి. 


మరో ఆసక్తికర కథనం: జిల్‌ జిల్‌ జియో ఫైనాన్స్‌, రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ రికార్డ్‌