India Gold Demand: ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో, మన దేశంతో పాటు అంతర్జాతీయంగానూ బంగారం డిమాండ్‌ తగ్గింది. రికార్డ్‌ స్థాయికి చేరుకున్న పసిడి రేట్లు దీనికి కారణం. ప్రస్తుతం, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 61 వేలకు పైగా పలుకుతోంది, కొన్ని రోజుల క్రితం 63 వేల రూపాయల రికార్డ్‌ స్థాయికి కూడా చేరింది. ఈ సంవత్సరంలో 10 శాతం పెరిగింది.


2023 జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశంలో పసిడి డిమాండ్‌ 112.5 టన్నులుగా నమోదైంది. 2022 ఇదే త్రైమాసికంలో గిరాకీ 135.5 టన్నులుగా ఉంది. దీనితో పోలిస్తే ఇప్పుడు 17% డిమాండ్‌ తగ్గింది. విలువ పరంగా చూస్తే.. 2022 జనవరి-మార్చి కాలంలోని రూ. 61,540 కోట్ల నుంచి 2023 జనవరి-మార్చి కాలంలో 9 శాతం తగ్గి రూ. 56,220 కోట్లకు చేరింది.


ప్రపంచ పసిడి మండలి (world gold council) నివేదిక ప్రకారం, కరోనా సమయమైన 2020 సంవత్సరాన్ని మినహాయిస్తే, బంగారం డిమాండ్ 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. 


ఆభరణాలకు తగ్గిన డిమాండ్
అధిక ధరలతో పాటు, రేట్లలో అస్థిరత కారణంగా ఆభరణాల కొనుగోలుదార్ల నుంచి డిమాండ్ పడిపోయింది, ఇది కూడా 6 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. 2022 మార్చి త్రైమాసికంలోని 94.2 టన్నుల నుంచి ఇప్పుడు 78 టన్నులకు 17 శాతం తగ్గింది. విలువ పరంగా చూస్తే రూ. 42,800 కోట్ల నుంచి రూ. 39,000 కోట్లకు పరిమితమైంది. 2020 మినహా, 2010 నుంచి ఇప్పటివరకు ఉన్న మార్చి త్రైమాసికాల్లో పసిడి ఆభరణాలకు గిరాకీ 100 టన్నుల దిగువన నమోదు కావడం ఇది నాలుగోసారి.


బంగారంలో పెట్టుబడుల డిమాండ్ కూడా 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు తగ్గింది. విలువ పరంగా చూస్తే, రూ. 18,750 కోట్ల నుంచి రూ. 17,200 కోట్లకు పరిమితమైంది.


రీసైకిల్ బంగారానికి పెరిగిన డిమాండ్
రికార్డ్‌ స్థాయిలో పెరిగిన ధరల వద్ద కొత్త బంగారాన్ని కొనలేక, ప్రజలు తమ పాత బంగారాన్ని రీసైకిల్ చేయడానికి మొగ్గు చూపారు. అంటే, పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్చుకోవడం పెరిగింది. దీంతో, రీసైకిల్ బంగారం 022 జనవరి-మార్చి కాలంలోని 27.8 టన్నుల నుంచి 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో 25 శాతం పైగా పెరిగి 34.8 టన్నులకు చేరింది. ఫిజికల్‌ గోల్డ్‌ కొనడానికి బదులు, డిజిటల్‌ పద్ధతుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడం కూడా పెరిగింది. 


బులియన్ దిగుమతులు గతేడాది 134 టన్నులుగా ఉండగా, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో స్థిరంగా ఉన్నాయి. అయితే, ముడి బంగారం దిగుమతి 52 టన్నుల నుంచి 30 టన్నులకు 41 శాతం పడిపోయింది. 2023లో పసిడికి పెద్దగా డిమాండ్‌ ఉండకపోవచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో పసిడికి గిరాకీ 750-800 టన్నుల మేర ఉండొచ్చని చెబుతున్నారు.


అంతర్జాతీయ స్థాయిలోనూ తగ్గిన డిమాండ్‌
జనవరి-మార్చి కాలంలో అంతర్జాతీయ స్థాయిలోనూ పసిడి గిరాకీ పడిపోయింది. 2022 జనవరి-మార్చి కాలంలోని 1,238.5 టన్నుల నుంచి 2023 జనవరి-మార్చి కాలంలో 13 శాతం తగ్గి 1,080.8 టన్నులకు దిగి వచ్చిందని పరిమితమైందని ప్రపంచ పసిడి మండలి తెలిపింది.


బంగారం నిల్వలు పెంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వరుసగా ఐదో సంవత్సరంలోనూ తన వద్ద బంగారం నిల్వలను పెంచుకుంది. సింగపూర్, చైనా, టర్కీ, రష్యా సహా వివిధ ఇతర సెంట్రల్ బ్యాంకుల నుంచి ఏడు టన్నుల నుంచి 796 టన్నుల వరకు కొనుగోలు చేసింది.