ఉద్యోగ భవిష్య నిధి (EPFO) వడ్డీరేటును 8.1 శాతంగా ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను ఉద్యోగులు జమ చేసిన మొత్తంపై ఈ వడ్డీరేటును అమలు చేయనున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం.


ఉద్యోగ భవిష్య నిధి (EPFO) వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గించాలన్న ఈపీఎఫ్‌ ట్రస్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2021-22 ఏడాదికి ఇదే వడ్డీ రేటు అమలు చేయనుంది. ట్రస్టు ధర్మకర్తలు చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్‌వో అధికారికి తాజాగా వెల్లడించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఈపీఎఫ్‌పై అతి తక్కువ వడ్డీరేటు ఇదే కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో తెలిపారు.


ఎప్పుడెప్పుడు తగ్గింది?


ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించించడంతో గతంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. 1977-78 ఆర్థిక సంవత్సరం లో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గిస్తూ తీర్మానం చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో కొత్త వడ్డీ రేటు అమలులోకి వచ్చింది 


అసలేంటీ ఈపీఎఫ్...దాని మీద వడ్డీ


ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమ రిటైర్ మెంట్ వరకు ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం రూపొందిందే ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్. షార్ట్ కట్ లో ఈపీఎఫ్ అంటారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం 1952 తో ఈపీఎఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ ను నిర్వహించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరుతో ఓ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దానికి ఓ బోర్డు,..ట్రస్ట్ సభ్యులు కూడా ఉంటారు. 


ఉద్యోగులు తాము ప్రతినెలా పొందే జీతంలో కొంత భాగం అంటే బేసిక్ ఆదాయంలో 12 శాతం ఈ పథకానికి చందాగా జమచేయాల్సి ఉంటుంది. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ జమ చేస్తుంది. దీనికి వడ్డీ కూడా చెల్లిస్తుంటారు. రిటైర్ అయ్యేనాటికి ఉద్యోగి, యజమాని జమచేసిన మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి చేతికి అందుతుంది. ఈపీఎఫ్ లో రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ నిధిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి. అంతేకాకుండా నిర్దేశిత వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది.


సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వడ్డీ 8.1 శాతం ఇదే. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గుతుంది. 2020 - 21 ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటు 8.50 శాతంగా కట్టించారు. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-2014, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. అయితే కోవిడ్ సంక్షోభ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించారు. 8.5 శాతం వడ్డీని చందాదారులకు ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని కొనసాగించారు.