Bank Account Hack: 


ప్రస్తుతం ఆధార్‌ నంబర్‌, బ్యాంకు అకౌంట్‌ నిత్యావసరాలుగా మారిపోయాయి. ఇవి లేకుండా చాలా పనులను చేయలేం. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా ఇబ్బందులు తప్పవు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం చేసినప్పటి నుంచి కొన్ని భయాలు వెంటాడుతున్నాయి. సైబర్ నేరగాళ్లకు ఆధార్‌ నంబర్‌ తెలిస్తే బ్యాంకు సొమ్ము దోచుకుంటారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం!


భద్రమే!


ఆధార్‌ నంబర్‌ తెలిసినంత మాత్రాన బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయలేరని నిపుణులు అంటున్నారు. ఓటీపీ, వేలి ముద్ర, ఫేస్‌ ఐడీ, ఐరిష్‌ వివరాలు సైబర్‌ మోసగాళ్లకు తెలియనంత వరకు ఇబ్బందేమీ లేదని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ కన్జూమర్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ అనిల్‌ రావ్‌ తెలిపారు. అందుకే వీటికి భద్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


మోసం!


గతేడాది డిసెంబర్లో జరిగిన ఓ మోసం మాత్రం అందరిలోనూ వణుకు పుట్టించింది. 2022లో దక్షిణ హరియాణాలోని పల్వాల్‌ తహసీల్దారు ఆఫీసులో సైబర్‌  మోసగాళ్లు వేలి ముద్రలు దొంగిలించారు. అలాగే వారి ఆధార్‌ నంబర్లు సేకరించారు. వాటిని ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ (AePS) వద్ద ఉపయోగించి భారీ స్థాయిలో డబ్బులు కొట్టేశారు. దాంతో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది.


ప్రొటొకాల్స్‌ పెంపు


ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొట్టేయడంతో ప్రభుత్వం సెక్యూరిటీ ప్రొటొకాల్స్‌ను పెంచింది. 'ఫింగర్‌ ప్రింట్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌లో నకిలీ లేదా గమ్మీ చేతి ముద్రలతో చేసే మోసాల నుంచి రక్షించేందుకు యూఐడీఏఐ కృత్రిమ మేథస్సు లేదా మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఫింగర్‌ మైన్యూటి రికార్డు - ఫింగర్‌ ఇమేజ్ రికార్డు (FMR - FIR)ను ఉపయోగిస్తోంది' అని 2023, జులై 31న ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవంత్‌ కరాద్‌ తెలిపారు.


ఏఐ టెక్నాలజీ


యూఐడీఏఐలోని ఆధార్‌లో మన చేతి వేలి ముద్రలు, ఐరిష్‌ భద్రపరిచి ఉంటాయి. ఆధార్‌తో అనుసంధానమైన చెల్లింపు వ్యవస్థల్లో వీటినే వాడుతారు. వీటి ఆధారంగా మోసాలు జరగకుండా ఉండేందుకు FMR - FIR ఉపయోగపడుతుంది. సిలికాన్‌ను ఉపయోగించి నకిలీ వేలి ముద్రలతో డబ్బులు దోచుకొనేందుకు ప్రయత్నించడంతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ చేతి వేలి ముద్రలు, అందులోని రేఖలు, రేఖల మధ్య ఖాళీ, జీవజాలాన్ని గుర్తిస్తుంది. ఫింగర్‌ప్రింట్‌ చిత్రాల్లోని వేలి ముద్రల్లో రేఖలు మందంగా కనిపిస్తాయి. ఆ రేఖల మధ్య లోయలు తేలికగా ఉంటాయి. అలాగే రేఖల మధ్య కొనసాగింపు ఉండదు.


ఎన్‌పీసీఐ ప్రొటొకాల్‌


ఇలాంటి మోసాల నుంచి అరికట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో సెక్యూరిటీ ప్రొటొకాల్‌ను ప్రవేశపెట్టింది. ఫ్రాడ్‌  రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (FRM) టెక్నాలజీ తీసుకొచ్చింది. ఇది రియల్‌ టైమ్‌లో మోసాల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. దీనిని ఎన్‌సీపీఐ బ్యాంకులకు ఉచితంగా అందించింది.


మోసం తీరు


సాధారణంగా మోసాలు రెండు రకాలుగా జరుగుతాయి. ఒకటి మోసగాళ్లు ఆర్థిక వ్యవస్థల సర్వర్లను హ్యాక్‌ చేస్తారు. లేదంటే అక్కడి డేటాబేస్‌ను దొంగిలిస్తారు. అందులోని వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తారు. లేదంటే కస్టమర్లే పొరపాటున వారి సమాచారాన్ని ఇవ్వడం వల్ల మోసపోతారు.


Also Read: రూ.20 లక్షల కోట్ల టాటా సామ్రాజ్యం! వారసురాలిగా ఆమెకే పట్టం!!


లాక్‌ చేయండి


ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ నుంచి లావాదేవీలు చేపట్టాలంటే బ్యాంకు పేరు, ఆధార్‌ సంఖ్య, బయోమెట్రిక్‌ అవసరం. అయితే ఈ మూడింటిని చేజిక్కించుకుంటేనే సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేయగలరు. ఇవి మోసగాళ్లకు చిక్కొద్దంటే పౌరులు ఒక పని చేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐలో మీ మొబైల్‌తో బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అథెంటికేషన్‌ ఫెయిల్‌ అయినప్పుడు ఎర్రర్‌ కోడ్‌ 330 డిస్‌ప్లే అవుతుంది.