Maya Tata: 


టాటా.. ప్రతి భారతీయుడికి పరిచయం అక్కర్లేని పేరు! దేశంలో ఈ బ్రాండ్‌ తెలియనోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఉప్పు నుంచి కూరగాయల వరకు, ఏసీల నుంచి విమానాల వరకు, దుస్తుల నుంచి నగల వరకు అన్నింట్లోనూ టాటా బ్రాండ్‌కు తిరుగులేదు.


ఈ భూమ్మీద ప్రధానమైన అన్ని దేశాల్లోనూ టాటాలకు ఉనికి ఉంది. రూ.20 లక్షల కోట్ల మహా వ్యాపార సామ్రాజ్యం ఇది. జేఆర్‌డీ టాటా, రతన్‌ టాటా వంటి దిగ్గజాలు ఈ గ్రూప్‌ను నడిపించారు. ఇప్పుడా వారసత్వ పగ్గాలు ఓ మహిళ అందుకోబోతోందని తెలిసింది. ఆమే మాయా టాటా!


మెడికల్‌ ట్రస్టులో మెంబర్‌


ప్రతిష్ఠాత్మక టాటా మెడికల్‌ సెంటర్‌ ట్రస్టులో మాయా టాటా బోర్డు మెంబర్‌. ఆమె తోబుట్టువులు లెహ్‌, నెవిల్‌ సైతం సభ్యులే. ఈ ముగ్గురికీ రతన్‌ టాటాయే మెంటార్‌. ఆయనే స్వయంగా వీరికి వ్యాపార పాఠాలు నేర్పిస్తున్నారని సమాచారం. రతన్‌ టాటా సోదరుడు నోయెల్‌ టాటా, పల్లోంజీ మిస్త్రీ కుమార్తె అలూ మిస్త్రీ మాయ తల్లిదండ్రులు. కారు ప్రమాదంలో మరణించిన సైరస్‌ మిస్త్రీ ఆమెకు మేనమామ అవుతారు. ఆమె కుటుంబం మొత్తం వ్యాపారానికి అంకితమైనవారే.


ఉద్యోగ ప్రస్థానం 


బ్రిటన్‌లోని బేయెస్‌ బిజినెస్‌ స్కూల్‌, వార్విక్‌ యూనివర్సిటీలో మాయా టాటా చదువుకున్నారు. టాటా క్యాపిటల్‌ సబ్సిడరీ టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో ఆమె మొదట పనిచేశారు. అప్పుడే ఆమె పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌, కార్పొరేట్‌ ప్రపంచంలోని డైనమిక్స్‌ను అర్థం చేసుకున్నారు. తన నైపుణ్యాలను మెరుగు పర్చుకున్నారు. ఈ ఫండ్‌ను మూసేయడంతో ఆమె తన కెరీర్‌లో మార్పు వచ్చింది. గ్రూప్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టాటా డిజిటల్‌కు వెళ్లారు. టాటా న్యూ యాప్‌ ఇందులోదే. ఈ వెంచర్‌ కోసం టాటా గ్రూప్‌ ఏకంగా రూ.1000 కోట్లు కేటాయించింది. ఇమ్మెర్సివ్‌ షాపింగ్‌ అనుభవాన్ని అందించేందుకు ఆమె కొత్త మార్గాలు వెతికారు. బిజినెస్‌ గ్రోత్‌ కోసం శ్రమిస్తున్నారు.


అందరూ గొప్పోళ్లే


టాటా గ్రూప్‌ను దశదిశలా విస్తరించిన రతన్‌ టాటా స్వయంగా మాయా టాటాకు వ్యాపార పాఠాలు నేర్పిస్తుండటం గమనార్హం. ఆయన మెంటార్‌షిప్‌లో ఆమె తన వ్యాపార దక్షతను మరింత మెరుగు పర్చుకుంటున్నారు. ఆయనే స్వయంగా మాయా, లెహ్‌, నెవెల్‌ను టాటా మెడికల్‌ సెంటర్‌ ట్రస్టులోకి ఆహ్వానించారు. మాయా కుటుంబంలో అందరూ ఏదో ఒక విభాగంలో అత్యుత్తమ స్థాయికి చేరినవారే. ఆమె అత్త, సైరస్‌ మిస్త్రీ సతీమణి రోహికా మిస్త్రీ రూ.56,000 కోట్ల సంపదకు అధిపతి. దేశంలోనే అత్యంత సంపన్నురాలైన రెండో మహిళ.


రికార్డు ఖాయమేనా?


ఒకవేళ మాయా.. టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టారంటే సరికొత్త రికార్డు సృష్టిస్తారు. ఒకప్పుడు 34 ఏళ్లకే జేఆర్‌డీ టాటా వ్యాపార బాధ్యతలు స్వీకరించారు. అనేక కంపెనీలను స్థాపించారు. టాటాల కుటుంబ, వ్యాపార విలువలను మాయ కొనసాగిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఎలాగూ రతన్‌ టాటా మార్గనిర్దేశం ఉంటుంది. పైగా న్యూ ఏజ్‌ టెక్నాలజీ, అనలిటిక్స్‌లో ఆమెకు తిరుగులేదు. మరికొన్ని రోజుల్లో నిర్వహించే టాటా బోర్డు సమావేశంలో ఆమె ఎంపికపై నిర్ణయం రావొచ్చు.


Also Read: చంద్రయాన్‌ 3 ఎఫెక్ట్‌ - ఇన్వెస్టర్లను లాభాల మీద ల్యాండ్‌ చేసిన స్పేస్‌ స్టాక్స్‌