Pradhan Mantri Suraksha Bima Yojana: ప్రతి ఒక్కరికి జీవిత బీమా లేదా ప్రమాద బీమా చాలా అవసరం. ఎక్కువ ప్రీమియం కట్టలేని అల్పాదాయ వర్గాల ప్రజలను కూడా, అతి తక్కువ ఖర్చుతోనే బీమా రక్షణ కిందకు తీసుకురావడానికి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రారంభించిన పథకం పేరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana). ఇది ప్రమాద బీమా పథకం ‍‌(accidental insurance policy). ఈ పాలసీ కొనడానికి సంవత్సరానికి కేవలం 20 రూపాయలు ఖర్చు చేస్తే చాలు. అంటే, 2 కప్పుల 'టీ' కోసం చేసే ఖర్చు ఇది. ఇంత తక్కువ పెట్టుబడితో రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ పొందొచ్చు.


ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వివరాలు


కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను 2015లో లాంచ్‌ చేసింది. మన దేశంలో, ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ కోసం ఎక్కువ ఖర్చు చేయలేక, అధిక ప్రీమియం కట్టలేక, బీమా రక్షణకు దూరంగా ఉన్న ప్రజలు ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉన్నారు. అలాంటి వ్యక్తులకు, వాళ్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడానికి సెంటర్ల్‌ గవర్నమెంట్‌ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం ద్వారా, దేశంలోని పేద, బడుగు వర్గాలకు కూడా బీమా సౌకర్యం అందుతోంది. 


ఈ పథకానికి ఎవరు అర్హులు?


18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న ఎవరైనా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కవరేజ్‌ పొందొచ్చు. ఈ బీమా కవరేజ్‌లో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే, అతని కుటుంబానికి (నామినీకి) 2 లక్షల రూపాయలు అందుతాయి. ఒకవేళ, ప్రమాదంలో పాక్షికంగా అంగవైకల్యం ఏర్పడితే, బీమా చేసిన వ్యక్తికి ఒక లక్ష రూపాయలు చేతికి వస్తాయి. ఈ స్కీమ్‌ కవరేజ్‌ ఆగకుండా కొనసాగాలంటే, ప్రతి సంవత్సరం 20 రూపాయలు కడితే చాలు. ఏడాదికి 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ కంటిన్యూ అవుతుంది.


ప్రీమియం ఎవరికి కట్టాలి?
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన రక్షణ కిందకు రావడం చాలా ఈజీ. ఈ పథకం ప్రయోజనాలు అందుకోవాలనుకునే వ్యక్తికి బ్యాంక్‌ ఖాతా ఉంటే చాలు. మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి, PMSBY కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పని కూడా చాలా సింపుల్‌గా ఐపోతుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆటో డెబిట్ మోడ్ ద్వారా ప్రతి సంవత్సరం జూన్ 1న మొత్తం మీ ఖాతా నుంచి 20 రూపాయలు ఆటోమేటిక్‌గా డెబిట్‌ అవుతాయి. ఈ పథకం ఏటా జూన్ 1వ తేదీ నుంచి తర్వాతి సంవత్సరం మే నెల 31వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుంది. మళ్లీ జూన్‌ 1వ తేదీ నుంచి ఫ్రెష్‌గా స్టార్‌ అవుతుంది. రెన్యువల్‌ కోసం మీరు బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బులు మీ అకౌంట్‌ నుంచి ఆటో-డెబిట్‌ అవుతాయి.


ఒకవేళ ఇప్పటి వరకు బ్యాంక్‌ అకౌంట్‌ లేకపోతే, కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేసి, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన రక్షణ కిందకు రావచ్చు.


మరో ఆసక్తికర కథనం: మీ కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయండి, పెళ్లి ఖర్చులన్నీ ఎల్‌ఐసీ భరిస్తుంది!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial