కేసులైనా, అరెస్టులైనా డోంట్‌ కేర్‌ అంటున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. చస్తే చావండి మాకేంటి? శవాల నుంచి కూడా సొమ్ము వసూల్‌ చేస్తాం. చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. ఈ ఆన్‌లైన్‌లో ఊరించే ఈజీలోన్‌ ..చివరకు ఉరితాడవుతోంది. యాప్‌లోన్‌ అప్పు నిండుప్రాణాలను బలితీసుకుంటోంది. తీసుకున్న లోన్లు యమపాశంలా మారీ ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట లోన్‌ రికవరీ ఏజెంట్ల ఆగడాలను తట్టుకోలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వందల కోట్ల రూపాలయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని, దేశం విడిచిపోయిన వారిని వదిలేసి.. రూ. 1000, రూ. 2000 రూపాయల లోన్‌ తీసుకున్నోడినే తీవ్రంగా హింస్తున్నారు.


కొన్నిసార్లు పరిస్థితులు బాలేక లోన్‌ కట్టడం కాస్త ఆలస్యం అవుతుందోనేమో కానీ.. కచ్చితంగా కట్టే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఇదేం పట్టించుకోకుండా వాళ్లకు సమయం ఏమి ఇవ్వకుండా తీవ్రంగా హింసిస్తుంటారు బ్యాంక్‌ ఏజెంట్లు. రాబందుల్లా ఇబ్బందులు పెడుతూ.. అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ ఇంట్లో వాళ్లను సైతం ఇబ్బందులకు గురి చేసేవారిపై యాక్షన్‌ తీసుకునే హక్కు మీకు ఉందని మీకు తెలుసా.? అంతేకాదు.. లోన్‌ తీసుకున్న వ్యక్తికి.. లోన్‌ రికవరీ ఏజెంట్‌ ఎప్పుడు పడితే కాల్స్‌ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, అలాగే ఇంట్లోవాళ్లకు ఫోన్‌ చేసి బెదిరించడం వంటివి చేసే హక్కు లేదు. అలా చేసినందుకు సంబంధిత బ్యాంక్‌ లేదా లోన్‌ యాప్‌పై లేదా సంబంధిత లోన్‌ ఏజెంట్‌లపై లోన్‌ తీసుకున్న వ్యక్తి కేసు పెట్టొచ్చు. 


బ్యాంక్‌కు లోన్‌ రికవరీ ఏజెంట్లు కేవలం ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య మాత్రమే కాల్‌ చేయాలి. ఒకవేళ రాత్రి 7 తర్వాత కాల్‌ చేసిన, లేదా బ్యాంక్‌ ఆటోమెటిక్‌ కాల్‌ సెంటర్‌ నుంచి కాల్‌ వస్తే.. మీరు మొదట సంబంధిత బ్యాంక్‌ అఫీషియల్‌ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి, కంప్లైంట్‌ ఇవ్వొచ్చు. మీ లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ రెండు కానీ పక్షంలో మీరు నేరుగా.. ఆర్బీఐ ఆఫీషియల్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి, అందులో ఉంటే కంప్లైయింట్ నెంబర్‌కు కాల్‌ చేసి మరీ చెప్పవచ్చు.


ఇప్పటికే అక్రమ రుణ యాప్‌ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. యాప్‌ స్టోర్లలో కేవలం చట్టబద్ధమైన యాప్స్‌ మాత్రమే ఉంచి అక్రమ యాప్‌లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇటీవల రుణ యాప్‌ల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాదు.. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్‌ల జాబితాను ఆర్‌బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్‌ అగ్రిగేటర్లంతా ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్‌ అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.