Stock Market Opening Bell 19 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు ఇవాళ (సోమవారం) న్యూట్రల్‌గా ప్రారంభమయ్యాయి. యూఎస్‌ ఫెడ్‌ సమావేశం, అమెరికన్‌ మార్కెట్లు శుక్రవారం నెగెటివ్‌గా ముగియడం, ఆసియా మార్కెట్ల నుంచి ఇవాళ ప్రతికూల సంకేతాలు అందడంతో మన మార్కెట్‌లో సెంటిమెంట్‌ కొద్దిగా తగ్గింది. 


ఈ నెల 20, 21 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ (యూఎస్‌ ఫెడ్‌) మానిటరింగ్‌ పాలసీ కమిటీ సమావేశం ఉంది. ప్రపంచ మార్కెట్ల దృష్టి ఇప్పుడు దీని మీదే ఉంది. వడ్డీ రేట్లను యూఎస్‌ ఫెడ్‌ ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచుతుంది, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్‌ ఇస్తుంది అన్నదానిపై ఈ మూడు రోజులు (సోమ-బుధ) ప్రపంచ మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. అగ్రరాజ్యంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులోనూ అంచనాలను దాటింది కాబట్టి, వడ్డీ రేట్లను 75-100 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం, బుధవారం అర్ధరాత్రి ఫెడ్‌ నిర్ణయం వెలువడేంత వరకు, మన మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ ఊగిసలాట ఉండొచ్చు. 75 బేసిస్‌ పాయింట్లను అంచనా వేసిన మన మార్కెట్‌, దానికి అనుగుణంగా ఇప్పటికే సర్దుబాటుకు గురైంది. ఒకవేళ 100 బేసిస్‌ పాయింట్ల పెంపుపై నిర్ణయం వస్తే మాత్రం, మార్కెట్లు మరింత జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పెట్టుబడిదారులు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.


BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,840 పాయింట్ల  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ (సోమవారం) 93 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 58,747 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి... 58,487.76 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకింది. 59,146.96 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని నమోదు చేసింది. అదే సమయానికి 0.50 శాతం లేదా 291.78 పాయింట్ల లాభంతో 59,132.57 వద్ద ట్రేడవుతోంది.


NSE Nifty
శుక్రవారం 17,530 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 10 పాయింట్లు లేదా 0.06 శాతం లాభంతో 17,540 పాయింట్ల వద్ద ఓపెనైంది. ఉదయం 10 గంటల సమయానికి... 17,429.70 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,613.55 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. అదే సమయానికి 0.52 శాతం లేదా 92 పాయింట్ల లాభంతో 17,622 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank
శుక్రవారం 40,776 పాయిట్ల వద్ద ముగిసిన ఈ సూచీ, ఇవాళ 91 పాయింట్లు లేదా 0.22 శాతం నష్టంతో 40,985 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి... 40,509.90 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని తాకింది. 41,113.70 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. అదే సమయానికి 0.73 శాతం లేదా 295.90 పాయింట్ల లాభంతో 41,072.70 వద్ద కొనసాగుతోంది.


Top Gainers and Lossers
ప్రారంభ గంటలో... నిఫ్టీ50లోని 28 కంపెనీలు లాభాల్లో ఉండగా, 22 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం&ఎం, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్‌ లాభాల్లో కళకళలాడగా... అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్ పెయింట్స్‌, సిప్లా, టైటన్‌, టాటా మోటార్స్‌ నష్టాల్లో విలవిల్లాడాయి. ఆ సమయానికి 9 రంగాల సూచీలు గ్రీన్‌లో, 6 రంగాల సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నిప్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీలు లాభాల్లో ముందంజలో ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఒక శాతం వరకు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.