Mutual fund: ఇండియన్‌ మార్కెట్ల దశ, దిశను ప్రధానంగా నిర్ణయించేది ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs). FPIsలో ప్రపంచ స్థాయి పెట్టుబడి కంపెనీలు, గ్లోబల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌, విదేశీ లక్ష్మీపుత్రులు ఉంటారు. ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల విలువైన షేర్లు కొనడం లేదా అమ్మడం వీళ్లకు మంచినీళ్ల ప్రాయం. ఈ భారీ క్రయవిక్రయాల వల్ల మార్కెట్‌లో తీవ్ర స్థాయి ఒడిదొడుకులు ఉండకుండా బ్యాలెన్స్‌ చేసేది దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ (MFs).


కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణంగా FPIs కొనుగోళ్లకు దిగితే, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ అమ్మకాలు చేస్తుంటాయి. FPIs అమ్మకాలకు దిగితే, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొంటుంటాయి. ఇలా బ్యాలెన్స్‌ అవుతుంది.


ఇక అసలు విషయానికి వస్తే.. ఆగస్టు నెలలో విదేశీ మదుపుదారుల నుంచి వచ్చిన బలమైన ఇన్‌ఫ్లోల కారణంగా; రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), ఇన్ఫోసిస్ ‍‌(Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి బ్లూచిప్ స్టాక్స్‌లో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ హోల్డింగ్స్‌ను తగ్గించాయి.


రూ.1,200 కోట్ల విలువైన షేర్ల విక్రయం


గత 17 నెలల్లో తొలిసారిగా, గత నెలలో MFలు నికర విక్రయదారులుగా (net-sellers) మారాయి, రూ.1,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇదే నెలలో FPIs రూ.51,204 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 


గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ నెల వరకు FPIలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వాళ్లు రూ.3 ట్రిలియన్ల (రూ.3 లక్షల కోట్లు) విలువైన స్టాక్స్‌ను డంప్ చేశారు. ఆ కాలంలో MFలు కొనుగోళ్లు చేశాయి.


విదేశీ ప్రవాహాలు బలంగా ఉండడంతో, వాల్యుయేషన్లు పెరిగిపోతాయన్న ఆందోళనల కారణంగా దేశీయ ఫండ్స్ లాభాలను బుక్ చేసుకుంటున్నాయి.


రిలయన్స్‌లో రూ.2,030 కోట్ల విలువైన షేర్లు, భారతీ ఎయిర్‌టెల్‌లో రూ.1,950 కోట్ల విలువైన షేర్లు, ఇన్ఫోసిస్‌లో రూ.1,120 కోట్ల విలువైన షేర్లను MFలు విక్రయించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.1,080 కోట్లు, టీసీఎస్‌లో రూ.1,080 కోట్ల విలువైన షేర్లను డంప్‌ చేశాయి. 


Sona BLWది అగ్ర స్థానం


ఆగస్టులో MFలు అత్యధికంగా కొనుగోలు చేసిన స్టాక్స్‌లో ఆటో రంగ అనుబంధ కంపెనీ Sona BLWది అగ్ర స్థానం. దాదాపు రూ.1,900 కోట్ల పెట్టుబడిని ఈ స్టాక్‌ ఆకర్షించింది. ప్రైవేట్ ఈక్విటీ మేజర్ బ్లాక్‌స్టోన్ అమ్మేసిన వాటాను MFలు కైవసం చేసుకున్నాయి.


ప్రభుత్వ యాజమాన్యంలోని NTPC రెండో అత్యధిక కొనుగోలు స్టాక్‌గా (రూ.948 కోట్ల నికర కొనుగోళ్లు) నిలిచింది. ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ (రూ.850 కోట్లు) ఉంది.


మిడ్‌ క్యాప్‌ రేంజ్‌లో మాక్స్ హెల్త్‌కేర్ (రూ.760 కోట్లు), ఎన్‌ఎండీసీ (రూ.600 కోట్లు), గ్లాండ్ ఫార్మా (రూ.460 కోట్లు) నిలిచాయి.


స్మాల్‌ క్యాప్స్‌లో.. రోలెక్స్ రింగ్స్ (రూ.460 కోట్లు), కిర్ల్ న్యూమాటిక్ (రూ.240 కోట్లు), సిర్మా ఎస్‌జీఎస్ టెక్ (రూ.180 కోట్లు) అత్యధిక ఇన్‌ఫ్లోలను చూశాయి. ఇదే సమయంలో; కిర్లోస్కర్ ఆయిల్ (రూ.170 కోట్లు), గ్రాన్యూల్స్ ఇండియా (రూ.120 కోట్లు), వీఐపీ ఇండస్ట్రీస్ (రూ.90 కోట్లు) భారీ ఔట్‌ ఫ్లోలతో విలవిల్లాడాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.