Axis Bank - Kotak Bank: కరోనా కాలం తర్వాత మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వ్యాపారాలను పెంచుకోవడానికి వీధి వ్యాపారుల నుంచి అంబానీ, అదానీల వరకు ఆరాటపడుతున్నారు. ఇందుకున్న మార్గం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడమే. దీంతో, బ్యాంకుల గడప తొక్కేవాళ్ల సంఖ్య, రుణాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంస్థలు కూడా లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇస్తున్నాయి. ఫలితంగా, బ్యాంక్‌ల రుణ వ్యాపారాలు సూపర్‌ ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి (Q4FY22) బ్యాంకుల త్రైమాసిక ఫలితాల్లో రుణ వృద్ధి, ఆదాయ వృద్ధి కనిపిస్తోంది. ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అందువల్లే, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) కూడా బ్యాంకింగ్‌ సెక్టార్‌లోకి పెట్టుబడులను పంప్‌ చేస్తున్నారు. ఈ కారణం వల్ల ఇటీవలి నెలల్లో బ్యాంక్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేస్తున్నాయి. 


₹4,500 కోట్ల సమీకరణ
అసలు విషయానికి వస్తే... వచ్చేవాళ్లకు అప్పులు ఇవ్వాలంటే బ్యాంకులకూ డబ్బు కావాలిగా. అందుకే ఇటీవలి నెలల్లో చాలా బ్యాంకులు ఫండ్‌ రైజింగ్స్‌లోకి దిగాయి. ఆకర్షణీయమైన ఇంట్రస్ట్‌తో బాండ్లను ఆఫర్‌ చేస్తున్నాయి. రుణాల డిమాండ్‌ను తీర్చడానికి, తాజాగా, యాక్సిస్‌ బ్యాంక్‌ & కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ కూడా బాండ్ల బాటలోకి అడుగు పెట్టాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను ఇవి విక్రయించడానికి మార్కెట్‌లోకి వచ్చాయి. మరికొన్ని వారాల్లో, ఈ రెండు బ్యాంకులు ₹4,500 కోట్ల వరకు ఇష్యూలను అందించబోతున్నాయని సమాచారం.


డెట్‌ మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతానికి, యాక్సిస్ బ్యాంక్ ₹3,000 కోట్ల వరకు సేకరించవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ₹1,500 కోట్ల వరకు సమీకరించాలని అనుకుంటోంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ రేటును పెంచుతుడడంతో, ప్రతి నెలా రీ ప్రైస్‌కు గురయ్యే డిపాజిట్ల వెంటబడడం కంటే, దీర్ఘకాలిక నిధులను సేకరించడమే కరెక్టని బ్యాంకులు నమ్ముతున్నాయి.


AAA రేటింగ్‌
ప్రతిపాదిత రెండు బాండ్లకూ ట్రిపుల్-ఏ (AAA) రేటింగ్‌ దొరికింది. ఈ బాండ్ల మీద ఇచ్చే వడ్డీని ఎక్స్ఛేంజ్ బిడ్డింగ్ ప్రాసెస్‌ ద్వారా నిర్ణయిస్తారు. 7.40-7.60 శాతం పరిధిలో వడ్డీ రేటు ఉండవచ్చని మార్కెట్‌ నిపుణలు చెబుతున్నారు.


AAA రేటింగ్‌ అంటే ఉన్నత స్థాయి రేటింగ్‌. వీటిలో రిస్క్‌ చాలా చాలా తక్కువ. అదే సమయంలో వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది.


బాండ్ల జారీ మీద, ఇప్పటికే ఈ  రెండు బ్యాంకులు ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్, బాండ్ హౌస్‌లు సహా కొందరు పెట్టుబడిదారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఈ విషయం మీద ఇంకా అధికారికంగా స్పందించలేదు.


ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఈ నెల 13న, 7.42 శాతం వడ్డీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను విక్రయించింది, ₹2,100 కోట్లను సేకరించింది. వీటి కాలపరిమితి ఏడేళ్లు.


అత్యుత్తమ క్రెడిట్‌-డిపాజిట్‌ రేషియో
ప్రస్తుతం క్రెడిట్‌-డిపాజిట్‌ రేషియో (credit-deposit ratio) 80 శాతంగా ఉంది. అంటే, సమీకరించిన డిపాజిట్లలో 80 శాతాన్ని అప్పులు రూపంలో బ్యాంకులు తిరిగి ఇస్తున్నాయి. ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకింగ్‌ రంగం అంత బూమ్‌లో ఉన్నట్లు అర్ధం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో క్రెడిట్-డిపాజిట్ రేషియో 73.5 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 70.5 శాతంగా ఉంది. 80-90 నిష్పత్తిని అత్యుత్తమ నిష్పత్తిగా ఈ రంగంలో లెక్క వేస్తారు. ఇప్పుడు బ్యాంకింగ్‌ రంగం ఇలాంటి అత్యుత్తమ స్థితిలో ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.