Adani Enterprises into Nifty50: ఇవాళ (శుక్రవారం) మార్కెట్‌ అదానీ మయమైంది. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలన్నీ రెచ్చిపోయి ర్యాలీ చేస్తున్నాయి. 


రాబోయే రెజిగ్‌లో, అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను నిఫ్టీ50 ఇండెక్స్‌లోకి చేర్చినట్లు ప్రకటించారు. దీంతో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు శుక్రవారం జోరు మీద ఉన్నాయి.


సెప్టెంబర్ 30 నుంచి నిఫ్టీ50లోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అడుగు పెడుతుంది. నిఫ్టీ50 ఇండెక్స్‌లో ఇప్పటికే ఉన్న, ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ శ్రీ సిమెంట్‌ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది. అంటే, నిఫ్టీ 50 నుంచి శ్రీ సిమెంట్‌ బయటకు వెళ్తుంది.


ఎడెల్‌వైస్ ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం... నిఫ్టీ50 ప్యాక్‌లో చేరడం వల్ల, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌లోకి కొత్తగా $183 మిలియన్ల ఇన్‌ఫ్లోలు రావొచ్చు. అంటే, నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ఫాలో అయ్యే పాసివ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్క్రిప్‌లోకి పెట్టుబడులు పెరుగుతాయి. 


అంతేకాదు, నిఫ్టీ50 అంటే ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌ 50 క్వాలిటీ కంపెనీల గ్రూప్‌. కాబట్టి, దేశీయ సంస్థాగత మదుపుదారులు (డీఐఐలు), విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు), హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు ‍కూడా ఈ కంపెనీ షేర్లను కొత్తగా కొనేందుకు లేదా ఉన్నవాటినే పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా ఈ స్టాక్‌కు డిమాండ్‌, కొనుగోళ్లు పెరుగుతాయి. డిమాండ్‌ కనిపిస్తుంది కాబట్టి స్టాక్‌ ధర పెరుగుతుంది. ఆ ప్రయోజనాన్నే మార్కెట్‌ ఇవాళ (శుక్రవారం) రివార్డ్‌ చేసింది.


నిఫ్టీ50లోకి చేరుస్తున్నామన్న ప్రకటన తర్వాత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఇవాళ (శుక్రవారం) దాదాపు 4 శాతం జంప్ చేసి రూ.3,368కి చేరాయి. ఇది కొత్త గరిష్ట స్థాయి రికార్డు. గురువారం ఈ స్క్రిప్ రూ.3,232.75 వద్ద ముగిసింది.


ఈ పెరుగుదల తర్వాత, కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం రూ.3.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ రూ.90,000 కోట్లకు పైగా ఉంది.


అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ తర్వాత, గౌతమ్ అదానీ గ్రూప్‌ నుంచి నిఫ్టీ50 ఇండెక్స్‌లో చోటు సంపాదించిన రెండో స్టాక్‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్ అవుతుంది.


అదానీ గ్రూపులో మొత్తం ఏడు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. అవి.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మార్. 


మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి, ఒక్క అదానీ పవర్‌ తప్ప మిగిలిన నేమ్స్‌ అన్నీ పచ్చరంగులో ఉన్నాయి. కొన్ని 1 శాతం పైగా పెరిగాయి.


అదానీ గ్రూపు సంస్థల అధిపతి అయిన గౌతమ్‌ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కురుబేల్లో మూడో ర్యాంకులో ఉన్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.