Udayshivakumar IPO: నిర్మాణ కంపెనీ ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా షేర్ల మీద 'వీక్‌ మార్కెట్‌' దెబ్బ బలంగా పడింది. ఇవాళ (సోమవారం, 03 ఏప్రిల్‌ 2023) దలాల్‌ స్ట్రీట్‌లో అడుగు పెట్టిన ఈ షేర్లు, ఇష్యూ ధర కంటే 14.29% డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యాయి. IPO ధర రూ. 35 అయితే, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో ఈ స్టాక్ రూ. 30 వద్ద ప్రారంభమైంది.


వాస్తవానికి, IPO సమయంలో పెట్టుబడిదార్ల నుంచి బలమైన స్పందన అందుకున్న ఈ ఇష్యూ, భారీగా 30 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. NSE డేటా ప్రకారం.. IPO ఆఫర్‌లో 2 కోట్ల షేర్లను తీసుకువస్తే, 61.26 కోట్ల షేర్ల కోసం బిడ్‌లు అందుకుంది. 


ఐపీవోలో.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌ల (NIIs) భాగం 60.42 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్  (QIBs) కోటా 40.47 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్‌ను ఆకర్షించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 14.10 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.


లిస్టింగ్‌కు ముందు, అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా షేర్లు రూ. 7-8 ప్రీమియంతో చేతులు మారాయి. ఇంత డిమాండ్‌ ఉన్న షేర్లు లిస్టింగ్‌ సమయంలో మాత్రం కొంప ముంచాయి.


కంపెనీ వ్యాపారం
ప్రధానమంత్రి స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టుల క్రింద జాతీయ & రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, స్మార్ట్ రోడ్లు మొదలైన వివిధ రహదారి ప్రాజెక్టులను నిర్మించే వ్యాపారాన్ని ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా (Udayshivakumar Infra Ltd) చేస్తోంది. 2022 డిసెంబర్‌ నాటికి, కంపెనీ వద్ద 111 నిర్మాణ పరికరాలు, 46 డంపర్‌లు, 51 ఇతర నిర్మాణ వాహనాలు, 7 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు ఉన్నాయి.


2022 డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి ఈ కంపెనీ చేతిలో 46 వర్క్ ఆర్డర్‌లు ఉన్నాయి. ఆ సమయానికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 1,291 కోట్లు. వీటిలో 30 ప్రస్తుతం కొనసాగుతున్నాయి, మిగిలిన 16 కొత్త వర్క్ ఆర్డర్‌లు ఇంకా ప్రారంభం కాలేదు.


లాభనష్టాలు - రిస్క్‌లు
FY22లో (2021-22 ఆర్థిక సంవత్సరం) ఉదయశివకుమార్ ఇన్‌ఫ్రా రూ. 185 కోట్ల ఆదాయాన్ని, రూ. 12 కోట్ల లాభాన్ని ఆర్జించింది. FY20-22 కాలంలో కంపెనీ గ్రోత్‌ ట్రెండ్‌ మిశ్రమంగా ఉంది. ఈ కాలంలో ఆదాయం 2.1% CAGR వద్ద తగ్గింది, ఎబిటా (EBITDA) ఫ్లాట్‌గా ఉంది, పన్ను తర్వాతి లాభం (PAT) 7.6% CAGR పెరిగింది.


ఈ కంపెనీకి ఉన్న కీలక రిస్క్‌ల్లో క్లయింట్ బేస్ ఒకటి. ప్రధానంగా ప్రభుత్వం & ప్రభుత్వం నిధులు సమకూర్చే ఇతర సంస్థల నుంచి వచ్చే ఆర్డర్ల మీదే ఈ కంపెనీ ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన లేదా ఇచ్చే ప్రాజెక్టులపై ఆధారపడుతోంది. కంపెనీ ఆదాయంలో ఎక్కువ మొత్తం పరిమిత సంఖ్యలోని క్లయింట్ల నుంచి వస్తోంది కాబట్టి, దీనిని రిస్క్‌ ఫ్యాక్టక్‌గా చూడాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.