దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ (LIC)! ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఈ కంపెనీ ఐపీవో మే4, బుధవారం నుంచి మొదలవుతోంది. సాధారణ ఇన్వెస్టర్లు ఈ తేదీ నుంచి ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు.


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఆఫర్‌ వివరాలు: అప్పర్‌ బ్యాండ్‌ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.


ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్‌ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్‌ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎల్‌ఐసీ ఫ్రొఫైల్‌: గ్రాస్‌ రిటన్‌ ప్రీమియం (GWP), న్యూ బిజినెస్‌ ప్రీమియం (NBP) ప్రకారం ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. వ్యక్తిగత పాలసీలు, గ్రూప్‌ పాలసీలు అత్యధికంగా విక్రయించిన కంపెనీ ఇదే. ఇతర కంపెనీలతో పోలిస్తే NBPలో 61.4 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న ప్రవేటు కంపెనీ వాటా 9.16 శాతమే కావడం గమనార్హం.


కంపెనీ ఫైనాన్షియల్స్‌: 2021 ఆర్థిక ఏడాది ముగింపు నాటికి ఎల్‌ఐసీ వద్ద రూ.37,46,404 కోట్ల ఆస్తులు (AUM) ఉన్నాయి. అంతకు ముందు ఏడాది రూ.34,14,174 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదు చేసింది. నికర లాభం రూ.2710 కోట్ల నుంచి రూ.2,974 కోట్లకు పెరిగింది.


కొనే ముందు చూడాల్సింది: కొన్నేళ్లుగా ఎల్‌ఐసీ తన మార్కెట్‌ వాటాను కోల్పోతోంది. ప్రైవేటు కంపెనీలు వేగంగా చొచ్చుకుపోతున్నాయి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ప్రకారం చూస్తే ఎల్‌ఐసీకి 64 శాతం మార్కెట్‌ షేర్‌ ఉంది. 2016-2021 మధ్య 9 శాతం సీఏజీఆర్‌ నమోదు చేసింది. అదే సమయంలో ప్రైవేటు కంపెనీలు 18 శాతం వృద్ధి నమోదు చేశాయి.


ఎల్‌ఐసీలో ఇప్పటికీ ప్రభుత్వానికే ఎక్కువ వాటా ఉంటుంది. భవిషత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే షేర్‌ హోల్డర్లపై ప్రభావం పడొచ్చు. ఎల్‌ఐసీకి డిజిటల్‌ ప్రజెన్స్‌ ఎక్కువగా లేదు. 90 శాతం పాలసీలు ఏజెంట్ల ద్వారానే విక్రయిస్తున్నారు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే కంపెనీకి ఖర్చులు మరింత పెరుగుతాయి.