ఐపీవో ముగింట భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. శుక్రవారం ఈ కార్యక్రమం ఉండనుందని తెలిసింది. మే 4న ఎల్‌ఐసీ ఐపీవోకు వస్తున్న సంగతి తెలిసిందే. 


దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ ఐపీవోకు కొన్ని రోజుల క్రితమే ముహూర్తం ఫిక్స్‌ అయింది. 2022, మే 4న ఇష్యూ మొదలవుతోంది. మే9న ముగియనుంది. 16న ఇన్వెస్టర్ల డీమ్యాట్‌ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. ఆ మరుసటి రోజే మార్కెట్లో లిస్ట్ అవుతాయి.


ఎల్‌ఐసీ రూ.6 లక్షల కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. ఇందులో 3.5 శాతం వరకే ప్రభుత్వం వాటా విక్రయిస్తోంది. రూ.20,557 కోట్లు విలువైన 22.13 కోట్ల షేర్లను మాత్రమే విక్రయిస్తోంది. షేర్ల ధరను రూ.902-949గా నిర్ణయించింది. ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. ఉద్యోగులకు 15.81 లక్షల షేర్లు, పాలసీ దారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వు చేశారు. రిటైల్‌ షేర్‌ హోల్డర్లు, ఉద్యోగులకు రూ.45, పాలసీహోల్డర్లకు రూ.60 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.


ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సేకరిస్తుందని సమాచారం. ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులో 3.5 శాతం వరకు వాటాను అమ్మేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


వాస్తవంగా ఫిబ్రవరిలోనే ఎల్‌ఐసీ డ్రాఫ్ట్‌ పేపర్లను సెబీ వద్ద దాఖలు చేసింది. కంపెనీలో 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను విక్రయిస్తామని తెలిపింది. హఠాత్తుగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభం కావడంతో ఐపీవోను వాయిదా వేసుకుంది. పరిస్థితులు కుదురుకున్నా, ఎకానమీ స్థిరత్వం పొందాక రావాలనుకున్నారు. ఇప్పటికీ సిచ్యువేషన్‌ సద్దుమణగక పోవడంతో ఇష్యూ సైజ్‌ను 3.5 శాతానికి కుదించారు.


ఈ ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ఎల్‌ఐసీ ఐపీవో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ రిసిప్టులు రూ.65,000 కోట్లుకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే రూ.13,531 కోట్లు ఎక్కువ.


లాట్‌సైజ్‌ - 15
ప్రైజ్‌ బ్యాండ్‌ - రూ.902 - 949
రిటైల్‌, ఎంప్లాయీస్‌కు డిస్కౌంట్‌ - రూ.45
పబ్లిక్‌ హోల్డర్లకు డిస్కౌంట్‌ - రూ.60
ఇష్యూ పరిమాణం : 22.13 కోట్లు