Price Hike: దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రజలపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా గరిష్ట స్థాయుల నుంచి ముడి చమురు ధరలు దాదాపు దాదాపు సగానికి తగ్గినా, మన దేశంలో ఇప్పటికీ పెట్రోల్ & డీజిల్ ధరలు ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపు నిత్యజీవితానికి సంబంధించిన ఆహార పదార్థాలు, వస్తువుల ధరలు కూడా ప్రియమయ్యాయి. అధిక చమురు ధరల కారణంగా రవాణా రేట్లు తారాస్థాయిలో ఉన్నాయి. గల్లీలో అమ్మే కూరగాయల దగ్గర నుంచి ఏసీ గదుల్లో అమ్మే ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ వరకు అన్నింటి మీదా రవాణా ఛార్జీల ప్రభావం పడింది. అన్ని వస్తువులు మరింత ఖరీదైనవిగా మారాయి, మారుతున్నాయి. 


FMCG కంపెనీలు కూడా దీనికి మినహాయింపు కాదు. పెరిగిన ధరలను ప్రజల మీదే ఆయా కంపెనీలు రద్దు తున్నాయి. వచ్చిన ఏ అవకాశాన్నీ నిత్యావసర సరుకుల కంపెనీలు వదిలిపెట్టడం లేదు. రోజువారీ వినియోగానికి సంబంధించిన వస్తువుల ధరలు గత రెండు నెలలుగా నిశ్శబ్దంగా పెరిగాయి. ఈ లిస్ట్‌లో.. పాలు, బిస్కెట్లు, చిరుతిళ్లు, టీ, కాఫీ, అనేక ఆహార పానీయాలు, ఇతర సరుకులు ఉన్నాయి. పెరిగిన రేట్ల భారమంతా నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. కేవలం గత రెండు నెలల్లోనే, మనకు తెలీకుండా ధరలు ఎంత పెరిగాయో మీకు తెలుసా..?


ధర 20 శాతం పెరిగింది
సబ్బులు, టూత్‌పేస్ట్‌లు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువుల ధరలను FMCG కంపెనీలు పెంచాయి. 2022 జనవరి నెలలో, ఈ వస్తువుల ధర 3 నుంచి 20 శాతం వరకు పెరిగింది. వీటి తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తుల ధరలు పెంచక తప్పలేదని ఆయా కంపెనీలు చెప్పుకొచ్చాయి. కొత్త సంవత్సరంలో (2023), సామాన్యుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న చాలా వస్తువులను FMCG కంపెనీలు మరింత ఖరీదైనవి మార్చేశాయి. పిల్లలు తాగే పాల పొడిని పరిశీలిస్తే.. దాని 500 గ్రాముల ప్యాకెట్ గతంలో రూ. 350 పలికింది. ఇప్పుడు దాని పరిమాణాన్ని 400 గ్రాములకు తగ్గించారు. అంతేకాదు, దాని ధర కూడా రూ. 415 కి పెరిగింది.


ప్యాకెట్ పరిమాణం తగ్గింది
ఇలా అనేక వస్తువుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రజలు కనిపెట్టకుండా ఉండడానికి ప్యాకెట్‌ సైజ్‌ను కంపెనీలు మార్చడం లేదు, కానీ అందులో ఉండాల్సిన పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తగ్గిన పరిమాణాన్ని ప్యాకెట్‌ మీద ముద్రిస్తున్నా, ప్యాకెట్‌ మొత్తం సైజ్‌ మారలేదు కాబట్టి ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఉదాహరణకు.. బిస్కట్‌ ప్యాకెట్లు. వీటి గరిష్ట పరిమాణం 20 శాతం తగ్గింది. చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే హ్యాండ్ వాష్ పౌచ్‌ల్లో ఉండాల్సిన కొలతను కూడా కంపెనీలు తగ్గించాయి. కొన్ని వస్తువుల పరిమాణం తగ్గించి పాత రేట్లనే వసూలు చేస్తున్నారు. రేటు మారలేదు కాబట్టి, సైజ్‌ తగ్గిందన్న రహస్యాన్ని ఎక్కువ మంది కనిపెట్టలేకపోతున్నారు. 


5 నెలల క్రితం మార్కెట్‌లో రూ. 5 కు లభించే చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇప్పటికీ రూ. 5 కే లభిస్తోంది, కానీ పరిమాణం బాగా తగ్గింది. చిప్స్, నామ్‌కీన్‌తో సహా అన్ని ప్యాక్ చేసిన వస్తువుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. నూడుల్స్ ప్యాకెట్ ధర 4- 5 రూపాయల వరకు పెరిగింది, దాని పరిమాణం కూడా గణనీయంగా తగ్గింది. కేవలం ఒకటి రెండు నెలల్లోనే వస్తువుల ధరల్లో, ముఖ్యంగా వాటి నికర పరిమాణంలో చాలా తేడా వచ్చింది.


దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతోందంటూ ప్రభుత్వాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతున్నాయి, దానికి తగ్గట్లుగా గణాంకాలు విడుదల చేస్తున్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు, సామాన్యుడికి ప్రయోజనం దక్కడం లేదు. పైగా, మోత మోగిపోతోంది. మీరు ఏదైనా మాల్‌ లేదా కిరాణా దుకాణానికి వెళ్తే.. పాత రేట్లు - ప్రస్తుత రేట్లను పరిశీలించండి, తేడా మీకే అర్ధం అవుతుంది.