Loksabha Election 2024: భారత స్టాక్ మార్కెట్లపై లోక్‌సభ ఎలక్షన్స్ వేడి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లలో ఓలటాలిటీ అధికమైంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఫలితాల అంచనాల ప్రభావం మార్కెట్లలో కనిపిస్తోంది. ఈ క్రమంలో కేవలం వారం రోజుల వ్యవధిలో దేశీయ స్టాక్ మార్కెట్లు రూ.10 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశాయి. ఎన్నికల ఫలితాల తర్వాతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 


ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరి 
ఈ క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 3 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4 శాతం మేర నష్టపోయాయి. అలాగే మార్కెట్లో పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితికి ఎన్నికల ఫలితాల అంచనాలే కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుత లెక్కల ప్రకారం ఆయా పార్టీలకు భారీ సీట్లు వస్తాయనే అంచనాలు మార్కెట్ కుదుపులకు కారణమవుతున్నాయి. వాస్తవానికి ఆయా పార్టీలు సర్వేల ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయా అనే దానిపై చర్చ జరుగుతోంది.


దేశీయ ఫండమెంటల్స్, గ్లోబల్ క్యూస్‌పై దృష్టి సారించడంతో ఎన్నికల అనంతరం మార్కెట్లలో విక్రయాలు స్వల్పకాలికంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్ మార్కెట్‌లలో కనిపించే ట్రెండ్‌లకు అనుగుణంగా మార్కెట్ పుంజుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో అనేక ముఖ్యమైన కంపెనీలు తమ ఆదాయాలను మార్కెట్ అంచనాలకు మించి నమోదు చేసిన సంగతి తెలసిందే. దీనికి తోడు ఈ ఏడాది అమెరికా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఊహాగానాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, చమురు ధరలు, యూఎస్ డాలర్ బలం వంటి అంశాలు కూడా మార్కెట్ డైనమిక్‌లను ప్రభావితం చేస్తున్నాయి.  


వాస్తవానికి గడచిన వారంలో బీఎస్ఈలో నమోదిత కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ రూ.396.6 లక్షల కోట్లకు క్షీణించింది. సూచీలోని 500 షేర్లలో దాదాపు 350 కంపెనీల షేర్ల విలువ దాదాపు 1 నుంచి 25 శాతం మధ్యలో క్షీణతను నమోదు చేశాయి. అలాగే మార్కెట్ అస్థిరతలను సూచించే ఇండియా విక్స్ సూచీ ఈ వారం ఏకంగా 26 శాతం పెరిగింది. ఎన్నికల ఫలితాల అంచనాలతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని లీడ్ ఎకనామిస్ట్ మాధవి అరోరా పేర్కొన్నారు. 


ప్రస్తుతం భారతదేశంలో లోక్ సభ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి ఫలితాలు జూన్ 4న ప్రకటించనున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ శాతం తక్కువగా ఉండటం, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనాసక్తిగా ఉండటం మార్కెట్లో పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. అయితే మార్కెట్లు ప్రస్తుతం మెజారిటీపై ఎక్కువ దృష్టిని సారించారు. ప్రస్తుత ప్రభుత్వం తన రిఫామ్స్ కొనసాగించాలంటే అందుకు కీలకమైనది మెజారిటీ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వారంలో 5 ట్రేడింగ్ దినాల్లో రూ.16,000 కోట్లు విలువైన తమ పెట్టుబడులను విక్రయించటం పరిస్థితులకు అద్ధం పడుతోంది.