Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. వారం ప్రారంభం నుంచి మార్కెట్లో కొంత ఒడిదొడుకులను చూపిస్తున్నాయి. దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇన్వెస్టర్లలో ఆందోళనలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ముందస్తు జాగ్రత్త కోసం లాభాల స్వీకరణకు సైతం దిగుతున్నారు. మరికొందరైతే కాల్, పుట్ ఆప్షన్లను కొంటూ ఎన్నికల ఫలితాల రోజు కోసం ఇప్పటి నుంచే బెట్టింగ్ షురూ చేసేశారు.


మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో అన్ని రంగాల్లో విస్తృత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. కేవలం ఎఫ్ఎంసీజీ రంగంలోని షేర్లు మినహా అన్ని ప్రధాన రంగాల్లోనూ అమ్మకాల అలజడి నష్టాలను మూటకట్టింది. ప్రధానంగా నేడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లో భారీ నష్టాలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయానికి మార్కెట్ల పతనం స్వల్పంగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇంట్రాడేలో 12 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 601 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ దాదాపు 200 పాటింట్ల క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.5.5 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇది బలహీనమైన ఇన్వెస్టర్ల సెంటిమెంట్లకు అద్ధంపడుతోందని నిపుణులు చెబుతున్నారు. 


నిన్నటి స్టాక్ మార్కెట్ల ముగింపు సమయంలో రూ.403.39 లక్షల కోట్లుగా ఉన్న పెట్టుబడిదారుల సంపద విలువ నేడు మార్కెట్లలో కొనసాగిన పతనంతో రూ.397.90 లక్షల కోట్లకు దిగజారింది. ఈ క్రమంలో పవర్‌గ్రిడ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ వంటి కంపెనీ షేర్లలో నెలకొన్న నష్టాలు సూచీలను కిందకు లాగాయి. ఈ క్రమంలో బీఎస్ఈలోని 19 రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 


నేడు ఆటో, మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల తిరోగమనం దలాల్ స్ట్రీట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఒకపక్క ఎన్నికలు కొనసాగుతుండగా.. మరో పక్క ఫారెన్ ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకుంటూ లాభాలు బుక్ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో గతంలో మాదిరిగానే ఇండియా విక్స్ సూచీ ఏప్రిల్ 23 తర్వాత కనిష్ఠ స్థాయి 10 నుంచి 70 శాతం పెరిగింది. ఇది అందకు ముందు ఎన్నికల సమయంలో పరిశీలిస్తే.. 2019లో 150 శాతం పెరగగా.. 2014లో గరిష్ఠంగా 212 శాతం పెరిగింది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలకు ముందు 25 వరకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


మధ్యాహ్నం 2.34 సమయంలో బెంచ్ మార్క్ సూచీల పనితీరు గమనిస్తే..



  • సెన్సెక్స్ సూచీ: 448 పాయింట్లు నష్టంలో ఉంది

  • నిఫ్టీ 50 సూచీ: 156 పాయింట్లు నష్టంలో కొనసాగుతోంది

  • నిఫ్టీ బ్యాంక్ సూచీ: 580 పాయింట్లు నష్టంలో ఉంది

  • నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ: 1007 పాయింట్లు నష్టంలో కొనసాగుతోంది