Foreign Portfolio Investors - Paytm: ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (FPIలు) Paytm అంటే పడడం లేదు. 29.7 మిలియన్ షేర్లను (2.97 కోట్ల షేర్లు) మార్కెట్‌లో పెట్టి అమ్మేశారు. ఇది, వాళ్ల మొత్తం హోల్డింగ్‌లో 44 శాతానికి సమానం. అంటే, దాచుకున్న దాంట్లో దాదాపు సగభాగాన్ని వదిలించుకున్నారు. Paytm ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్ (IPO) తర్వాత, ఏడాది తిరక్కుండానే ఇంత మొత్తాన్ని విక్రయించారు.


గత ఏడాది నవంబర్ 17న (స్టాక్ లిస్ట్ చేయడానికి ఒక రోజు ముందు), 127 FPIలకు Paytmలో పెట్టుబడులు ఉన్నాయి. ఆ తేదీన మొత్తం 67.1 మిలియన్ షేర్లు (6.71 కోట్ల షేర్లు) వాళ్ల చేతుల్లో ఉన్నాయి. కంపెనీ మొత్తం వాటాలో ఇది 10.37 శాతానికి సమానం. సెప్టెంబర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం... FPIల దగ్గర 37.4 మిలియన్ షేర్లు (3.74 కోట్ల షేర్లు) మాత్రమే ఉన్నాయి. అంటే, తమ హోల్డింగ్‌లో 44 శాతాన్ని FPIలు విక్రయించారు. అంతేకాదు, మరియు FPIల సంఖ్య కూడా 127 నుంచి 88కి పడిపోయింది.


IPO సమయంలో, Paytmలో 1.21 శాతం వాటా కలిగి ఉన్న మోర్గాన్ స్టాన్లీ ఏసియా (సింగపూర్) ఇకపై కంపెనీ వాటాదారుల లిస్ట్‌లో కనిపించడం లేదు. దాని ఓనర్‌షిప్‌ 1 శాతం కంటే తక్కువకు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.


వాళ్లు ఔట్‌ - వీళ్లు ఇన్‌
Paytm నుంచి FPIలు ఎగ్జిట్‌ అవుతుంటే, రిటైల్ షేర్‌హోల్డర్లు & మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు ఎంటర్ అవుతున్నారు. లిస్టింగ్ సమయంలో ఈ కంపెనీలో రిటైల్‌ షేర్‌హోల్డర్ల వాటా 2.79 శాతంగా ఉంటే.. సెప్టెంబర్ చివరి నాటికి 6.37 శాతానికి పెరిగింది. ఏదైనా ఒక స్టాక్‌లో  2 లక్షల రూపాయల కంటే తక్కువ పెట్టుబడులు ఉన్నవారు రిటైల్ షేర్‌హోల్డింగ్‌ కేటగిరీలోకి వస్తారు.


Paytmలో మ్యూచువల్ ఫండ్స్‌ వాటా 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగింది.


Paytm IPO సమయానికి, భారత దేశ చరిత్రలో ఇదే అతి పెద్ద IPO. ఒక్కో షేర్‌ ఇష్యూ ప్రైస్‌ రూ. 2,150. అయితే.. ఈ షేర్లు లిస్ట్‌ అయినప్పటి నుంచి క్షీణిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం, IPO ఇష్యూ ప్రైస్‌తో పోలిస్తే ఈ షేర ధరహ 70 శాతానికి పైగా తగ్గింది.


గురువారం (నవంబర్‌ 3, 2022) మధ్యాహ్నం 12.20 గంటల సమయానికి ఒక్కో షేరు రూ. 644 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇది 52% పడిపోయింది. గత ఆరు నెలలుగా కాస్త పుంజుకుంది. ఈ ఆరు నెలల్లో 10% పైగా రాణించింది. 


గ్లోబల్‌ బ్రోకరేజ్‌ గోల్డ్‌మన్‌ సాచ్స్‌ ‍(Goldman Sachs) Paytm 12 నెలల టార్గెట్ ప్రైస్‌ను రూ. 1,100గా ప్రకటించింది. మరికొన్ని త్రైమాసికాల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ 50 శాతం ఆదాయ వృద్ధిని అందుకుంటుందని ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్‌ ఆకర్షణీయమైన ధర ట్రేడవుతోందని పేర్కొంది.


ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ యాక్సిస్‌ క్యాపిటల్‌ (Axis Capital), Paytm స్టాక్‌కు రూ. 1,000 టార్గెట్‌ ప్రైస్‌ ప్రకటించింది. కంపెనీ వ్యాపారం తమ అంచనాలకు తగ్గట్లు పుంజుకుంటోందని రిపోర్ట్‌ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.