నిలకడైన వేగంతో పైకి చేరుకోకపోతే అంతకు మించిన వేగంతో కిందకు పడిపోవాల్సి వస్తుంది! వ్యాపార రంగానికీ ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. ఆస్తులు కాకుండా అప్పులపై ఆధారపడి ఎదిగిన వ్యాపార సామ్రాజ్యాలు అంతే వేగంగా పతనమవ్వడం చరిత్ర చెప్పిన కఠోర సత్యం!


గతంలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డేవాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సంక్షోభాలు భారత్‌ను ఇబ్బంది పెట్టాయి. 2008లో లేమన్‌ బ్రదర్స్‌ కుప్పకూలడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే పతనమైంది. ఇప్పుడు చైనా స్థిరాస్తి కంపెనీ 'ఎవర్‌ గ్రాండ్‌' దివాలా అంచుల్లో ఉండటం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టాక్‌ మార్కెట్లను కుప్పకూలుస్తోంది. ఇంతకీ ఈ ఎవర్‌గ్రాండ్‌ కథేంటి! భారత్‌పై దాని ప్రభావం ఏంటి?


అభివృద్ధి చూపిస్తూ అప్పులు
చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల మొత్తం అక్కడి రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిపైనే ఆధారపడింది. అత్యంత వేగంగా ప్రాజెక్టులు, టౌన్‌షిప్పులు, భవంతులూ కడుతూ ప్రపంచానికే తలమానికంగా నిలిచింది. ఐతే దీని వెనకాల దిమ్మదిరిగే రుణాలూ ఉన్నాయి. ఇప్పుడవే చైనా కొంప ముంచుతున్నాయి. అసాధారణమైన అభివృద్ధిని చూపిస్తూ ఎడాపెడా అప్పులు చేస్తూ పద్దు పుస్తకాల్లో లోపాలను కప్పిపుచ్చుకుంటూ తాము గొప్ప అని భ్రమింపజేసింది 'ఎవర్‌ గ్రాండ్‌'. బాండ్ల విక్రయం, పెట్టుబడులు, రుణాలు ఆకర్షిస్తూ ఎదిగింది. ఇప్పుడు కట్టలేని పరిస్థితికి చేరుకుంది.


Also Read: ZEE Merging with Sony: విలీనమైన దిగ్గజ మీడియా సంస్థలు.. జీ-సోనీ మధ్య ఒప్పందం, పూర్తి వివరాలివీ.. 


నిబంధనలు కఠినతరం
చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యాపార విధానాల్లో మార్పులు చేయడమే స్థిరాస్తి రంగంలో నష్టాలకు కారణంగా తెలిసింది. ఏడాది కాలంగా చైనా ప్రభుత్వం వ్యాపార విధానాలను కఠినతరం చేస్తోంది. పద్ధతులు మార్చుకుంటోంది. ఇప్పటికే అలీబాబా, ఫుడ్‌ డెలివరీ సంస్థ మీటువన్‌, రైడింగ్‌ యాఫ్‌ డిడి, మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ వీబో సహా అనేక వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు మొదలు పెట్టింది. రియల్‌ ఎస్టేట్‌పైనా ఉక్కు పిడికిలి బిగించింది. 


స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు విచ్చలవిడిగా రుణాలు తీసుకోకుండా చైనా పీపుల్స్‌ బ్యాంకు గతేడాది కళ్లెం వేసింది. వాటికి రుణాలు ఇచ్చేముందు మూడు నిబంధనలు చూసుకోవాలని చెప్పింది. అవే..
1) సంస్థల అప్పులు వాటి ఆస్తుల విలువలో 70 శాతానికి మించొద్దు. 
2) వారి నికర ఆస్తుల కన్నా నికర అప్పుల విలువ తక్కువగా ఉండాలి.
3) స్వల్పకాల రుణాలు తీర్చుకొనేందుకు మిగులు నగదు చేతిలో ఉండాలి.


వీటికి అర్హత సాధించకపోతే రుణాలు ఇవ్వొద్దని చైనా బ్యాంకు తెగేసి చెప్పింది. ఎవర్‌గ్రాండ్‌ ఆ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో రేటింగ్‌ సంస్థలు తక్కువ రేటింగ్‌ ఇచ్చాయి. దాంతో ఎవర్‌గ్రాండ్‌ అప్పులు, ఇబ్బందుల గురించి ప్రపంచానికి తెలిసింది. రుణదాతలు, ఇన్వెస్టర్లు, బాండ్స్‌ కొనుగోలు దారుల నుంచి ఒత్తిడి మొదలైంది.


Also Read: Online Payment: మీరు ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తారా? త్వరలో కొత్త రూల్ ఇదే..


ఏంటీ ఎవర్‌గ్రాండ్‌?
గ్వాంజౌ కేంద్రంగా 1996లో ఎవర్‌గ్రాండ్‌ మొదలైంది. చైనాలోనే అతిపెద్ద స్థిరాస్తి అభివృద్ధి సంస్థగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో  1300 ప్రాజెక్టులు సొంతం చేసుకుంది. అందులో 780 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. క్రీడా, మీడియా, ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ, గృహ నిర్మాణ రంగాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం భారీగా అప్పులు తీసుకొంది. దాంతో 300 బిలియన్‌ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంటే భారత కరెన్సీలో ఇది  దాదాపుగా 22 లక్షల కోట్లకు సమానం. మరో మూడు నెలల్లోనే 850 మిలియన్‌ డాలర్లు తీర్చేయాలి. మెటీరియల్‌ పంపిణీ దారులు, ఉద్యోగులకూ డబ్బులు ఇవ్వడం లేదు. సంస్థ బాండ్లు, షేర్ల విలువ 35 నుంచి 85 శాతానికి పడిపోయింది.


పరిష్కారం ఏంటి?
ఎవర్‌ గ్రాండ్‌ ప్రస్తుతం తన భూములు, నిర్మాణంలోని ఇళ్లు అమ్మేసేందుకు సిద్ధమైంది. ఇలా చేస్తే వాటి విలువ తగ్గుతుంది. ఇందుకు భాగస్వాములు అంగీకరించడం లేదు. చేతిలో డబ్బుల్లేక  ఆగిపోయిన నిర్మాణాలూ చేపట్టలేకపోతోంది. చైనాలో అన్ని స్థిరాస్తి  కంపెనీల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభంతో చైనాలో ఇళ్ల విలువ తరిగిపోయే ప్రమాదం నెలకొంది. అందుకే ఆ సంస్థ ఆస్తులను రుణాదాతలకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. షేర్లు కొన్నవారు ఇప్పటికే నష్టపోయారు. మున్ముందు లాభపడే అవకాశం అస్సల్లేదు. ఫలితంగా చైనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా మందగమనంలోకి జారుకోవచ్చు. డాలర్లలో అప్పులు చెల్లించాల్సి ఉండటంతో యువాన్‌ విలువనూ తగ్గించేందుకు ప్రభుత్వం వెనకాడకపోవచ్చు.


Also Read: e-SHRAM: ఈ గవర్నమెంట్ పోర్టల్‌లో ఫ్రీగా చేరండి, ఏకంగా రూ.2 లక్షల బెనిఫిట్ పొందండి.. పూర్తి వివరాలివీ..


భారత్‌కు భయం లేదా?
భారత్‌లో ఎవర్‌గ్రీన్‌ సంక్షోభ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఉక్కు, నిర్మాణ వస్తువుల ఎగుమతిదారులకు స్వల్పకాలం నష్టాలు రావొచ్చు. అయితే ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్యన సాగిన వాణిజ్య యుద్ధం మాదిరిగా ఇది రుణదాతలు, పెట్టుబడిదారుల చూపు భారత్‌పై పడేందుందుకు అవకాశం ఇవ్వొచ్చు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి