Changes from 1st November: 2022 అక్టోబర్‌ నెలను ముగించుకుని నవంబర్‌లోకి అడుగు పెట్టాం. క్యాలెండర్‌లోని ఈ 11వ నెల మీ జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆర్థికాంశాల నుంచి సాధారణ జీవితం వరకు కొంత కొత్తదనంలోకి మనం మారుతున్నాం. 


చలామణీలోకి డిజిటల్‌ రూపాయి
బిట్‌ కాయిన్స్‌ వంటి క్రిప్టో కరెన్సీకి విరుగుడుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డిజిటల్‌ రూపాయిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి (2022 నవంబర్‌ 1, మంగళవారం) నుంచి డిజిటల్‌ రూపాయి లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) చలామణీలోకి వచ్చింది. ప్రస్తుతానికి, ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్ కోసం మాత్రమే "హోల్‌సేల్‌ డిజిటల్‌ రూపాయి (e₹-W)" వినియోగాన్ని పరిమితం చేసింది.


తగ్గిన LPG ధర
LPG 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్‌ కంపెనీలు ఏకంగా రూ. 115.50 మేర తగ్గించాయి. మంగళవారం (నవంబర్ 1) నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను మాత్రం తగ్గించకుండా, యథాతథంగా ఉంచాయి.


PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు PM కిసాన్ పోర్టల్‌లో తమ స్థితిని తనిఖీ చేసుకోవడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఇవాళ్టి నుంచి తప్పనిసరిగా ఇవ్వాలి. అక్టోబర్‌ 31 వరకు, ఆధార్ నంబర్ ద్వారా తనిఖీ చేయగలిగారు. 


ఎయిమ్స్‌ ఓపీ ఉచితం
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) OPDలో, స్లిప్ కట్ పొందడానికి ఇవాళ్టి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎయిమ్స్‌లో స్లిప్ కట్ పొందడానికి రోగుల నుంచి వసూలు చేస్తున్న రూ.10 రుసుమును రద్దు చేశారు. కన్వీనియన్స్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్న రూ.300ని కూడా తీసేశారు. దీని వల్ల లక్షలాది మంది రోగులకు ప్రయోజనం కలుగుతుంది. 


GST రిటర్న్ కోసం కోడ్ తప్పనిసరి
నవంబర్ 1 నుంచి GST రూల్స్‌ కూడా మారాయి. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు కూడా, ఇకపై రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు 4 అంకెల HSN కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ కోడ్ 2 సంఖ్యలతో ఉండేది. ఇవాళ్టి నుంచి అది 4 అంకెలతో ఉంటుంది.


అన్ని బీమాలకూ KYC కంపల్సరీ
2022 అక్టోబర్‌ 31 వరకు, జీవిత బీమా పాలసీల కోసం మాత్రమే KYC చేయాల్సి ఉండేది. ఇవాళ్టి నుంచి ఆ రూల్‌ మారింది. ఆరోగ్యం లేదా సాధారణ బీమా వంటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా KYC చేయవలసి ఉంటుంది. ఇప్పటికే తీసుకున్న పాలసీలకు కూడా KYC చేయాల్సి ఉంటుంది. లేదంటే క్లెయిమ్‌ చేసుకోవడానికి అనుతించరు. నిన్నటి వరకు, రూ.1 లక్ష కంటే ఎక్కువ విలువైన బీమా పాలసీ తీసుకుంటేనే KYC చేయవలసి ఉండేది. నేటి నుంచి ఇది కూడా మారిపోయింది.


రైళ్ల సమయం మారింది
రైళ్ల కొత్త టైమ్‌ టేబుల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సూపర్‌ ఫాస్ట్, రాజధాని రైళ్లు సహా చాలా రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. కాబట్టి, నవంబర్‌ 1న లేదా ఆ తర్వాత మీరు రైలు ప్రయాణం పెట్టుకుంటే, స్టేషన్‌కు వెళ్లే ముందే రైలు వచ్చే సమయాన్ని తప్పకుండా తనిఖీ చేసుకోండి. కొన్ని రైళ్లకు స్టాపులు కూడా మారాయి, చూసుకోండి.


దిల్లీలో విద్యుత్ సబ్సిడీ కట్‌
దేశ రాజధాని దిల్లీలో విద్యుత్‌ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ సబ్సిడీ కోసం పేరు నమోదు చేయించుకున్నా, చేయించుకోకపోయినా దిల్లీ ప్రజలు ఒక నెలలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పొందారు. అక్టోబర్‌ 31తో దీనికి కాలం చెల్లింది. నవంబర్‌ 1 నుంచి కూడా విద్యుత్‌ సబ్సిడీ పొందాలంటే కచ్చితంగా రిజిస్ట్రర్‌ చేయించుకోవాలి. 


ముంబైలో వెనుక సీట్ బెల్ట్ తప్పనిసరి
ముంబై రోడ్లపై తిరిగే నాలుగు చక్రాల వాహనాల్లో వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లు సైతం సీట్‌ బెల్ట్ ధరించడం నేటి నుంచి తప్పనిసరి. మోటారు వాహనాల (సవరణ) చట్టంలోని సెక్షన్ 194 (బి) (1) ప్రకారం ఈ నిబంధన తెచ్చారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ విభాగం హెచ్చరించింది.