Business News in Telugu: 2023 నవంబర్ 19, ఆదివారం యావత్‌ భారతం ఒక్కటవుతుంది. ఆ రోజు దేశంలోని కోట్ల కుటుంబాలు టీవీలకు అతుక్కుపోతాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వీధులు నిర్మానుష్యం అవుతాయి. భారతీయులంతా ఫైనల్‌ మ్యాచ్‌ (ICC World Cup Cricket 2023 Final Match) జపం చేస్తారు. 


ఆదివారం రోజున, భారత్-ఆస్ట్రేలియా మధ్య తుది పోరు (India - Australia Cricket World Cup 2023 Final Match) జరుగుతోంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌కి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉన్నాడు. భారత్ మూడో ప్రపంచకప్ గెలవాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇప్పటికే... బంతి-బ్యాట్‌ మధ్య జరిగిన సమరంలో చాలా క్రికెట్‌ రికార్డులు బద్దలయ్యాయి. టీవీ, డిజిటల్ ప్రపంచంలో కూడా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ను  దాదాపు 5.3 కోట్ల మంది (viewership of cricket world cup) చూశారు. వ్యూయర్‌షిప్‌లో ఇదొక కొత్త శిఖరం. ఓవర్ల మధ్యలో ప్రసారమయ్యే వ్యాపార ప్రకటనలను (advertising rates for world cup cricket) అంతమందీ చూశారు. కోట్ల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి కాబట్టి, వ్యాపార ప్రకటనల రేట్లు చుక్కల్లో ఉన్నాయి. 


ఇప్పుడు, ఫైనల్‌ మ్యాచ్ సందర్భంగా ప్రకటనల రేట్లు మరింత భారీగా పెరిగాయి. ఒక్కో కంపెనీ, 10 సెకన్ల ప్రకటన కోసం రూ.35 లక్షల (Rs 35 lakhs for a 10 seconds ad) వరకు చెల్లించాల్సి వస్తోంది.


ఇప్పటికే 70 శాతం స్లాట్‌లు విక్రయం
డిస్నీ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ద్వారా ప్రపంచ కప్ క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రసారం అవుతున్నాయి. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే, దాదాపు 70 శాతం అడ్వర్‌టైజింగ్ స్లాట్లను కంపెనీలు కొనుగోలు చేశాయి. మిగిలిన 30 శాతం అడ్వర్టైజింగ్ స్లాట్‌లు ప్రపంచ కప్ సమయంలో మాత్రమే విక్రయించారు. ఇప్పుడు, ప్రపంచకప్ ఫైనల్‌కు కేవలం 10 శాతం స్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. టీమ్‌ ఇండియా ఫైనల్స్‌కు చేరిన వెంటనే, 10 సెకన్ల యాడ్‌ రేటును రూ.35 లక్షలు చేసింది డిస్నీ హాట్‌స్టార్.  అయితే, వివిధ కంపెనీలు డిస్నీ హాట్‌స్టార్‌తో బేరసారాలు సాగిస్తున్నాయి. చాలా కంపెనీలు 10 సెకన్ల స్లాట్‌ కోసం రూ. 25 నుంచి  రూ. 30 లక్షల చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, డిస్నీ హాట్‌స్టార్ తన రేట్లను పెద్దగా తగ్గించడానికి సిద్ధంగా లేదు.


టీవీల్లో రేట్లు కూడా రెట్టింపు 
నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, టీవీ & డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రకటనల రేట్లు రెండింతలు పెరిగాయి. ప్రపంచకప్ ప్రారంభంలో, టీవీల్లో ప్రకటనల రేటు 10 సెకన్లకు రూ.5 నుంచి 6 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.8 నుంచి 10 లక్షలకు చేరుకుంది. 2019 ప్రపంచ కప్‌తో పోలిస్తే వీక్షకులు టీవీలపై 12 శాతం ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. దీని ద్వారా స్టార్, డిస్నీ దాదాపు రూ.2500 కోట్ల లాభం పొందాయి.


వీక్షకుల రికార్డు రెండుసార్లు బద్దలు
డిస్నీ హాట్‌స్టార్ ప్రకారం, ఈ ప్రపంచకప్‌లో వీక్షకుల రికార్డు (viewership record of cricket world cup) రెండుసార్లు బద్దలైంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను 4.4 కోట్ల మంది వీక్షించడం ఓ రికార్డు. ఆ తర్వాత, భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు కాలచక్రంలో కలిసిపోయింది, ఆ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది చూశారు. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఈ రికార్డ్‌ కూడా చరిత్రగా మారిపోయే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. BARC డేటా ప్రకారం, 34 ప్రపంచకప్ మ్యాచ్‌లను 43 కోట్ల మంది ప్రేక్షకులు టీవీల్లో చూశారు.


మరో ఆసక్తికర కథనం: అహ్మదాబాద్‌కు విమాన టికెట్ రూ.40 వేలు, పండగ చేసుకుంటున్న విమాన సంస్థలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial