Economic Survey 2022: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేటి ఉదయం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి  ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1, 2022న కేంద్ర బడ్జెట్‌ను సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఒకరోజు ముందుగా నేడు ప్రి బడ్జెట్ ఆర్థిక సర్వే వివరాలను లోక్‌సభలో సమర్పించారు. ఆర్ధిక సర్వే సమర్పించిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు.


2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2022 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 8.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంచనా ప్రకారం దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 9.2 శాతంగా ఉండనుంది. 


కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించేందుకు పలు చర్యలు చేపట్టాయి. 


వచ్చే ఏడాదికిగానూ భారత ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల వృద్ధిని వేగవంతం చేయడానికి పాటించాల్సిన సంస్కరణను కూడా సర్వే ద్వారా వెల్లడించారు. 2020-21 ఏడాదికిగానూ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందడానికి నెలల ముందు లోక్‌సభలో సమర్పించిన ఆర్థిక సర్వేలో 6-6.5 శాతం అంచనా వేయగా, 7.3 శాతం అయింది.


ఆర్థిక సర్వేలో ఎక్కువగా ఫోకస్ చేసిన అంశం జీడీపీ. తదుపరి ఆర్థిక సంవత్సరానికి GDP ఎంత ఉండొచ్చుననే అంచనా వేసేందుకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ సర్వేను తయారుచేసింది. సరఫరాకు సంబంధించిన సమస్యలను అధిగమించి ఆర్థిక వ్యవస్థను మరింత పుంజుకునేలా చేయడానికి ప్రణాళికలు రచించారు. 


బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కవేలం కొన్ని రోజుల ముందు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా ఆర్థికవేత్త వి అనంత నాగేశ్వరన్‌ను కేంద్రం నియమించింది. క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీ, జూలియస్ బేర్ గ్రూప్‌తో అకడమిక్ మరియు మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన నాగేశ్వరన్.. కేవీ సుబ్రమణియన్ డిసెంబర్ నెలలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాక నియమితులయ్యారు.


ఆర్థిక సర్వే ఇలా చేస్తారు..
బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను రూపొందిస్తారు. ఇందులో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కొన్న సవాళ్లు, పనితీరును.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాటిని ఎదుర్కోవడానికి ముందస్తుగా కొన్ని వేసే అంచనాలు ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఆర్థిక సర్వే ఆధారంగా చేసేకుని తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ప్రతి ఏడాది భాగాలుగా ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను ఈ ఏడాది ఒకే వాల్యూమ్‌గా తయారుచేసి విడుదల చేశారు.


రోడ్లు, రహదారులు, రైల్వేలు, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌ వంటి మౌలిక సదుపాయాల ఆధారిత రంగాలపై దృష్టి సారించనున్నారు. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 13.5 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. ఏప్రిల్ నుంచి నవంబర్ 2021-22లో మొత్తం మూలధన వ్యయం గత ఏడాది మొత్తం రూ.2.41 లక్షల కోట్లతో పోలిస్తే రూ.2.74 లక్షల కోట్లకు పెరుగుదల కనిపించింది.


భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ కరోనా కారణంగా కాస్త దెబ్బతిందని, ఈ ఏడాది పురోగతి సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఉత్పత్తులు పెంచి, ఎగుమతి వృద్ధి చేసి తదుపరి ఆర్థిక సంవత్సరంలో లోటును పూడ్చుకునేందుకు ప్లాన్ చేశారు. గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫామేషన్ (GFCF) 2021-22లో 15 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు.


కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకుని, నష్టాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తూ మార్కెట్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. గతంలో నికర మార్కెట్ రుణాలలో 141.2 శాతం జంప్ ఉన్నప్పటికీ, 2020-21లో సెక్యూరిటీలపై ప్రభుత్వ సగటు వ్యయం 17 సంవత్సరాల కనిష్టానికి అంటే 5.79 శాతం అయింది. సాంకేతికత ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఉత్పాదకత పెంచాలని సర్వేలో సూచించారు. 


2070 నాటికి భారతదేశంలో కర్బన ఉద్గారాలు జీరో కావాలని వాతావరణ అంశాలను కీలకంగా మారుతాయని సర్వే పేర్కొంది. నూనె గింజలు, పప్పుధాన్యాలు మరియు చిన్న పంటలతో వైవిద్యం చూపాలని పేర్కొన్నారు. రైతులను వరి, గోధుమల సాగు నుండి పప్పుధాన్యాలు మరియు నూనె గింజల వైపు ప్రోత్సహించాలని దాని ద్వారా దిగుమతులు తగ్గించేందుకు దోహదం చేస్తుందని సర్వేలో అంచనా వేశారు.