ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆశలతో కూడుకున్న బడ్జెట్‌ 2023 ప్రజల ముందుూకు రానే వచ్చింది. 7 అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 


మిలెట్స్‌కి గ్లోబల్ హబ్‌గా భారత్


శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్‌. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. త్వరలోనే భారత్...తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు.. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నామని హామీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి.


త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌


త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ని ఏర్పాటు చేస్తాం. 100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుంది. గ్రామీణ మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధి జరిగింది. భవిష్యత్‌లో ఈ సాయం ఇంకా పెరుగుతుంది. ఆత్మ నిర్భరత భారత్‌కు ఇది నిదర్శనం. గ్రామీణ మహిళలకు సాయం చేయడమే కాదు. వారు నైపుణ్యాలు పెంచుకునేందుకూ తోడ్పడుతున్నాం. సామాజిక భద్రతనూ కల్పిస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి 


సాగు రంగంలో అంకుర సంస్థలకు తోడ్పాటు


ఈ బడ్జెట్‌లో కీలకంగా 7 అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. దేశంలో గత కొన్నేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది. గతంలో కన్నా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్గనైజ్డ్‌గా మారింది. ప్రజల జీవన శైలి కూడా మారింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రత్యేక నిధులు అందించి సాగు రంగంలో అంకుర సంస్థలకు తోడ్పాటనందిస్తాం. సవాళ్లు ఎదుర్కొనే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వెనకబడిన వర్గాలకు ప్రయారిటీ ఇచ్చారు.  


సామాన్యుల సాధికారతే లక్ష్యం


సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్‌ల విషయంలో భారత్‌ అనూహ్య వృద్ధి సాధించింది. పీఎం సురక్ష, పీఎం జీవన జ్యోతి యోజన పథకాల కింద 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందించాం. కోట్లాది మంది ప్రజలు పీఎం కిసాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ నిదర్శనం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదంతో ప్రభుత్వం అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందజేస్తోంది. 28 నెలల్లోనే 80 కోట్ల మంది ఆహార ధాన్యాలు అందించడం సామాన్య విషయం కాదని అభిప్రాయపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి .