BSNL News: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది! తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 'సర్కారీ కొలువు' అనే వైఖరిని మార్చుకోవాలని  హెచ్చరించారు. అంచనాల మేరకు పనిచేయని వాళ్లు రిటైర్మెంట్‌ తీసుకొని ఇంటికి వెళ్లాల్సిందేనని ఆయన అల్టిమేటమ్‌ జారీ చేశారని టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది.


'ఎంటీఎన్‌ఎల్‌కు భవిష్యత్తు లేదు. అక్కడ మేం చేసేందుకేమీ లేదు. దానికి ఉన్న అడ్డంకులు, సమస్యలేంటో అందరికీ తెలుసు. ఆ కంపెనీ కోసం మేం మరో ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తాం' అని అశ్విన్‌ వైష్ణవ్‌ అన్నారు. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌లోని 62వేల ఉద్యోగులకు అల్టిమేటమ్‌ జారీ చేశారు. కంపెనీ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


'మేం ఆశిస్తున్న అంచనాలను మీరు కచ్చితంగా అందుకోవాల్సిందే. లేదంటే అంతా సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పనిచేయండి లేదా ఇంటికెళ్లండి అనేది సరికొత్త సాధారణం' అని అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు.


బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుజ్జీవం కోసం కేంద్రం కొన్ని రోజులు ముందే రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన వెంటనే టెలికాం మంత్రి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో సమావేశం అయ్యారని తెలిసింది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ తరహాలోనే కస్టమర్లకు సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు పోటీపడి పనిచేయాలని ఆదేశించారు.


'పని చేయని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పొంది ఇంటికెళ్లొచ్చు. వీఆర్‌ఎస్‌కు ఒప్పుకోకుంటే మేం 56జే నిబంధన అమలు చేస్తాం. అందుకే మీరు అత్యుత్తమంగా పనిచేయాలి. లేదంటే ప్యాక్‌ చేసుకొని ఇంటికెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎలాంటి ప్రశ్నలకు తావులేదు' అని వైష్ణవ్‌ అన్నారు.


దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఈ మధ్యే ఆయన ఝార్సుగుడ ఎక్స్‌ఛేంజ్‌ను సందర్శించగా అక్కడ బురద, దుర్గదం వ్యాపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఉన్నతాధికారులు ఇంటికెళ్లక తప్పదని హెచ్చరించారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, సూపర్‌వైజర్లు బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు.


టెలికాం పరిశ్రమకు సంబంధించి చట్టాలను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వైష్ణవ్‌ అన్నారు. 'మేం సరికొత్త చట్టం తీసుకు రాబోతున్నాం. ప్రపంచంలోని ఇతర దేశాలు మనల్ని అనుసరించేలా లీగల్‌ స్ట్రక్చర్‌ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇది గ్లోబల్‌ ఇండస్ట్రీ' అని ఆయన అన్నారు.