Bengaluru IT Firms Lose: బెంగళూరు అంటే సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా. మన దేశ ఐటీ హబ్‌ ఆ నగరం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఓ వెలుగు వెలుగుతుంటారక్కడ. ఇది ఒకవైపు. రెండోవైపు చూస్తే.. నిత్యం వర్షం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు. ఆఫీసుకు చేరాలంటే గంటల కొద్దీ ఆ ట్రాఫిక్‌లో అగచాట్లు.


ఇక అసలు విషయానికి వద్దాం. గత నెల (ఆగస్టు) 30న, బెంగళూరు ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ఉద్యోగులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయి, దాదాపు 5 గంటల ఆలస్యంగా కార్యాలయాలకు చేరారట. దీనివల్ల ఐటీ సంస్థలకు ₹225 కోట్ల నష్టం వచ్చిందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'ఔటర్ రింగ్ రోడ్ కంపెనీల సంఘం', కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాసింది. ORRలో (ఔటర్ రింగ్ రోడ్‌) మౌలిక సదుపాయాలు చాలా పేలవంగా ఉన్నాయని, ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోతోందని ఆ లేఖలో పేర్కొంది. 


కృష్ణరాజపురం నుంచి బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ ప్రాంతం వరకు ఉన్న బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌లో, 5 లక్షలకు పైగా పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారని అంచనా. ఈ పరిధిలో, లక్షలాది ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. 17 కిలోమీటర్ల స్ట్రెచ్‌లోనూ కోటి మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరిలోనూ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా ఆదాయం వస్తోంది. అయితే, ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందంటూ 'ఔటర్ రింగ్ రోడ్ కంపెనీల సంఘం' తమ లేఖలో పేర్కొంది. బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని, నగర అభివృద్ధికి కూడా ఇది ప్రశ్నార్ధకమేనని సదరు సంఘం ప్రస్తావించింది.


పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇన్ఫర్మేషనల్‌ టెక్నాలజీ కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటాయని, బెంగళూరు నుంచి వేరే నగరాలకు తరలిపోవచ్చని, కొత్త కంపెనీలు కూడా రాకపోవచ్చని అసోసియేషన్ చెబుతోంది.


బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలపై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసరవాజ్‌ బొమ్మై స్పందించారు. ఈ ఏడాది చివరి వరకు WFH (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) నిర్వహించాలని ఐటీ సంస్థలను అభ్యర్థించారు. దానివల్ల ఇలాంటి భయంకరమైన ట్రాఫిక్ సమస్యలు ఆయా కంపెనీలకు ఉండవని, WFH వల్ల రోడ్ల మీద రష్‌ తగ్గితే అడ్డంకులు లేకుండా మెట్రో పని పూర్తి అవుతుందని వివరించారు. 


అయితే, వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల టార్గెట్లు పూర్తి కావడం లేదని, క్వాలిటీ తగ్గుతోందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. కొంతమేర WFH తో నెట్టుకొస్తున్నా, ఎక్కువ మందిని ఆఫీసులకు రప్పిస్తున్నాయి, ఉద్యోగులకు ట్రాఫిక్‌ పరీక్షలు పెడుతున్నాయి.


బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగర రహదారులు మరోసారి జలమయమయ్యాయి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం నీటితో నిండిపోయింది, ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఫాఫం.. ఐటీ ఉద్యోగులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో..!