Tesla Entry in India: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2.4 శాతంగా ఉంది. అయితే ఈవీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. ఆ పైన టెస్లా కూడా భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను టెస్లా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.


టెస్లా గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంపై చాలా చర్చ జరుగుతోంది. దీంతో పాటు రాబోయే కొన్నేళ్లలో కంపెనీ తన వాహనాలను కూడా భారతీయ రోడ్లపైకి తీసుకురాగలదు. అయితే ప్రారంభంలో టెస్లా తన కార్లను సీబీయూ మార్గం ద్వారా తీసుకువస్తుంది. అంటే పూర్తిగా అమెరికాలో రూపొంది మనదేశానికి ఇంపోర్ట్ అవుతాయన్న మాట. దీనికి సంబంధించిన టాక్స్‌పై కూడా గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది.


రాబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జనవరి 2024లో జరగబోతోంది. ఇందులో టెస్లాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి టెస్లా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. టెస్లా స్థానిక స్థాయిలో బ్యాటరీ ప్యాక్‌లను కూడా ఉత్పత్తి చేస్తే ఈవీ సెగ్మెంట్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.


ప్రపంచంలోని అతిపెద్ద ఆటో మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో టెస్లా ప్రవేశిస్తే పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా టెస్లా భారతదేశం కోసం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూడా ప్రయత్నిస్తుంది. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్‌ను ప్రోత్సహించడంతోపాటు ఈవీ విభాగంలో స్థిరపడేందుకు ఆసక్తిగా ఉంది.


టెస్లా మోడల్ 3, టెస్లా మోడల్ వై వంటి కార్లను సీబీయూ ద్వారా ఇక్కడకు తీసుకువస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తయారీకి సంబంధించి కమిట్‌మెంట్‌ను టెస్లా ఇస్తే దిగుమతి పన్నును కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇటీవలే లాంచ్ అయిన మోడల్ 3ని కూడా భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరాల్లో మరింత చవకైన స్థానికంగా ఉత్పత్తి అయిన మోడల్ 2 కూడా భారతదేశంలోకి రానుందని తెలుస్తోంది.


మరోవైపు కియా మోటార్స్ కూడా భారతీయ మార్కెట్ కోసం ఒక అద్భుతమైన విజన్‌ని వెల్లడించింది. సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీతో విజయాన్ని అందుకున్న కంపెనీ ఇటీవల దానికి మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. దీని తర్వాత 2024 జనవరిలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. ఇది కాకుండా హ్యుందాయ్ ఎక్స్‌టర్ తరహాలో ఒక మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనం కూడా లాంచ్ కానుంది. కంపెనీ ఇటీవలే భారతదేశంలో 'కియా క్లావిస్' పేరును ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసింది. ఈ పేరును కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ కోసం ఉపయోగించవచ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!