Pure ePluto 7G Max: ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేసే భారతీయ కంపెనీ ప్యూర్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కంపెనీ అందించనుందని కంపెనీ ప్రకటించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, హీరో ఎలక్ట్రిక్‌లతో పోటీ పడనుంది.


ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో హిల్‌స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెనరేషన్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు. దీని కోసం భారతదేశం అంతటా బుకింగ్ ప్రారంభం అయింది. అలాగే రాబోయే పండుగ సీజన్ నుంచి దీనికి సంబంధించిన డెలివరీ మొదలుకానున్నాయి. ఈ స్కూటర్‌ను మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ అనే నాలుగు రంగులలో కొనుగోలు చేయవచ్చు.


ఇంజిన్ ఎలా ఉంది?
ఈ మోడల్ స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5 కేడబ్ల్యూహెచ్ హెవీ డ్యూటీ బ్యాటరీతో రానుంది. దీని మోటారు గరిష్ట శక్తి 2.4 కిలోవాట్లుగా ఉంది. CAN ఆధారిత ఛార్జర్‌తో ఈ బైక్ మార్కెట్లోకి రానుంది. మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.


ఈప్లూటో 7జీ మ్యాక్స్‌లో ఏడు వేర్వేరు మైక్రో కంట్రోలర్లు, ఎన్నో సెన్సార్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఓటీఏ ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లను కూడా ఈ బైక్ పొందనుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ల కంటే శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలను కూడా ఇది పొందనుంది.


ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వధేరా మాట్లాడుతూ రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వినియోగదారులకు కూడా కోసం నిరంతరం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చేయాలనుకుంటున్నామని తెలిపారు. కస్టమర్లకు అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ అందించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. కొత్త ఫీచర్ల గురించి మాట్లాడుతూ మాక్స్ బ్యాటరీలో స్టేట్ ఆఫ్ ఛార్జ్ (SOC), స్టేట్ ఆఫ్ హెల్త్ (SOH) కోసం ఏఐ ఎనేబుల్డ్ పవర్ డిశ్చార్జ్ అకౌంటింగ్‌ ఉండనుందన్నారు. ఇది బ్యాటరీ లైఫ్‌ను 50 శాతం వరకు మెరుగుపరుస్తుందని తెలిపారు. మోడల్ రైడింగ్ టెరెయిన్ ఆధారంగా ఇంటెలిజెంట్ థ్రోటిల్ రెస్పాన్స్‌ను కూడా కలిగి ఉందని పేర్కొన్నారు. ఇందులో స్మార్ట్ సెన్సార్లు కూడా అందించారు.


మెరుగు పడనున్న రైడింగ్ అనుభవం
పవర్‌ట్రెయిన్ సామర్థ్యంలో మెరుగుదల గురించి మాట్లాడుతూ రోహిత్ వదేరా మాట్లాడుతూ ‘బ్రేకింగ్ దూరం, బ్రేకింగ్ సమయం, రోలింగ్ వీల్ వేగం, బ్రేకింగ్ ఫోర్స్ పరంగా బ్రేకింగ్ అనుభవం గణనీయంగా మెరుగుపడింది. దీని ఫలితంగా ముందు, వెనుక బ్రేక్ లైఫ్ సైకిల్ 30 శాతం పెరిగాయి. ఇది రేంజ్, సేఫ్టీని పెంచడానికి కోటింగ్ రీజెన్‌తో సహా ఈఏసీ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ రీజెన్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది.’ అన్నారు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial