ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీదారుల‌కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోపాలు కలిగి ఉన్న వాహనాలు విక్రయించారని ఆరోపిస్తూ... ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులు ఓలా, ఒకినావా, ప్యూర్‌ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెలాఖ‌రులోగా స‌మాధానం ఇవ్వాల‌ని కేంద్రం ఆదేశించింది. 


కేంద్రం ఇచ్చిన నోటీసులకు స్పందించి కంపెనీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. లోపాలు క‌లిగిన వాహ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు విక్రయించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ తన నోటీసులో కేంద్రం ప్రశ్నించింది. 


మెల్లిమెల్లిగా అంతా ఎలక్ట్రానికి వాహనాలవైపు మొగ్గుతున్న టైంలో వరుస ప్రమాదాలు కేంద్రానికి తలనొప్పిగా మారింది. వినియోగదారుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కంపెనీలు త‌యారు చేసిన ఎలక్ట్రిక్ వాహ‌నాల్లో కొన్నింటిలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ఫైర్‌ యాక్సిడెంట్ అయినట్టు విచారణలో తెలినట్టు తెలుస్తోంది. వరసుబెట్టి ఇలాంటి సంఘటనలు జరగడంతో కేంద్రానికి కోపం తెప్పించింది. అందుకే ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 


ఈ మధ్య జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై ఏప్రిల్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ... ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, జరిగిన వాటికి కారణాలు తెలుసుకునేందుకు ఆ కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఒక వేళ ఇది కంపెనీ తప్పులు ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అప్పట్లోనే హెచ్చరించారు. అలాంటి లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి తీసుకునేలా కూడా ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. 


కేంద్రం ఏర్పాటు చేసిన రిపోర్ట్‌లో కంపెనీ తప్పిదాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఆయా కంపెనీలు కనీసం బేసిక్‌ భద్రతా చర్యలు తీసుకోకుండానే వాహనాలు రిలీజ్ చేసినట్టు తేల్చిందా కమిటీ. బ్యాటరీ తయారీ విధానంలోనే లోపం ఉందని గుర్తించింది. సెల్‌ హీట్ అయిన తర్వాత ఆ వేడి వెళ్లేందుకు మార్గాన్ని కూడా ఇవ్వలేదని పేర్కొంది. 


రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయా కంపెనీలతో మాట్లాడిన నీతి ఆయోగ్‌... లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి తీసుకోమని సూచించింది. నీతి ఆయోగ్ సూచన మేరకు ఓలా, ఒకినావా కంపెనీ తాము తయారు చేసిన 7000 వాహనాలను వెనక్కి తీసుకున్నాయి.