ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మినీ స్థానిక సమరంలో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. అయితే గతంతో పోలిస్తే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో పాటు  నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాల్ని నమోదు చేసింది. మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ ఇచ్చింది.


నెల్లూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ ! 


నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ సాధించింది. ప్రతిపక్ష టీడీపీకి ఒక్క కార్పొరేటర్ సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ, జనసేన, వామపక్షాలు, స్వతంత్రులు కనీస సంఖ్యలో కూడా ఓట్లు సాధించలేకపోయాయి. 8 ఏకగ్రీవాలతోపాటు మొత్తం 54 వార్డుల్ని వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.    


Also Read : అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ గెలిస్తే టీడీపీ రద్దు ..వైఎస్ఆర్సీపీకి టీడీపీ సవాల్ !


నగర పంచాయతీల్లో  వైఎస్ఆర్‌సీపీ హవా !


మొత్తం పదకొండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న  కుప్పంపై అందరి దృష్టి ఉంది. కౌంటింగ్‌లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. మొత్తం 25 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ 19 గెల్చుకుంది. వీటిలో ఒకటి ఏకగ్రీవం అయింది. ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.  చంద్రబాబు కంచుకోటలో గెలవడంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు భారీ సంబరాలు చేసుకున్నారు. ఇక కడప జిల్లాలో జరిగిన కమలాపురం, రాజంపేట నగర పంచాయతీల్లోనూ వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. రెండుచోట్ల టీడీపీకి ఐదేసి వార్డులు లభించగా  వైఎస్ఆర్‌సీపీకి 15 వార్డులు వచ్చాయి. కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి 14, టీడీపీకి ఆరు వార్డులు వచ్చాయి. ఆర్థిక మంత్రి బుగ్గన స్వగ్రామం బేతంచర్ల. ఆయన ఇల్లు ఉన్న వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీలో వైఎస్ఆర్‌సీపీ 18 వార్డులు, టీడీపీ రెండు వార్డులు గెల్చుకున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీలోనూ అవే తరహా ఫలితాలు వచ్చాయి. 


Also Read : వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి


దర్శి, కొండపల్లి నగర పంచాయతీల్లో టీడీపీ ఆధిక్యం !


ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థులు 13 చోట్ల, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29  వార్డులు ఉండగా తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ చెరో 14 వార్డులు గెల్చుకున్నాయి. ఓ టీడీపీ రెబల్ అభ్యర్థి గెలిచారు. తర్వాత ఆమె టీడీపీలో చేరడంతో టీడీపీ బలం 15కు చేరింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికలో చివరికి వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. మొత్తం 31 వార్డులు ఉండగా వైఎఎస్ఆర్‌సీపీకి 18, టీడీపీకి 13 వార్డులు లభించాయి. కౌంటింగ్ సందర్భంగా పలు సార్లు రీకౌంటింగ్ జరడంతో అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యాయి. రీ కౌంటింగ్‌లో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు కలసి వచ్చింది. పల్నాడులోని గురజాల , దాచేపల్లి నగర పంచాయతీల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలిచింది. దాచేపల్లిలో  వైఎస్ఆర్‌సీపీకి 11 వార్డులు, టీడీపీకి 7 వార్డులు వచ్చాయి. గురజాలలో టీడీపీకి మూడువార్డులు మాత్రమే లభించాయి. 


Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


ఉపఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు !


ఇక పలు చోట్ల మున్సిపల్ కార్పొరేటర్, వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో రెండు పార్టీలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కాకినాడలో నాలుగు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే.. నాలుగు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. గుంటూరు ఆరో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. కొవ్వూరు 23వ వార్డు ఉపఎన్నికలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచారు. విశాఖలో రెండు కార్పొరేటర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. 


Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !


ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. వందకు 97 శాతం మార్కులిచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 


 





Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి