వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమె టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా ఉంటున్నారని ఆరోపించారు. అలా ఉండడం అనైతికమని అన్నారు. తండ్రిని అవమాన పర్చిన కాంగ్రెస్‌లో నిస్సిగ్గుగా చేరారని, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని విమర్శించారు. ఏపీ విభజన సమయంలో శకుని పాత్ర పోషించి అన్యాయం చేశారంటూ సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి పురంధేశ్వరిపై విమర్శలు చేశారు.


ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార  గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది. ఆంధ్ర ప్రదేశ్ ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి’’ అని విజయసాయి రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా?


నిన్న (నవంబరు 4) కూడా విజయసాయి రెడ్డి పురంధేశ్వరిపై సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ‘‘అమ్మా పురందేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?’’ అంటూ ప్రశ్నించారు.