Just In





Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rains In AP And Telangana: నేడు సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శనివారం నాడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంట ఉన్న అల్పపీడన ద్రోణి సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్నదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. తెలంగాణలోనూ కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నీటి గుంతలు, విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్రయ యానాంలలో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అదే జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వర్ష సూచన సాధారణంగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర తరహాలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవు. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో జూన్ 28 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది.
హైదరాబాద్లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిశాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు మరియు 23.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. పశ్చిమ దిశ నుంగి గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే