ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి సెంట్రల్ మధ్యప్రదేశ్ లోని ఆవర్తనం నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక  మీదగా ఇంటీరియర్ తమిళనాడు & పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది.  రాగల ఐదు రోజులులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. 


ఈ రోజు నుండి 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు,  మెరుపులు,ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగం)తో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 73 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా
‘‘అధిక పీడన ప్రాంతం మధ్య బంగాళాఖాతంలో విశాఖకి తూర్పున కేంద్రీకృతం అయ్యింది. దీని వలన తేమ గాలులు నేరుగా  ఆంధ్రాలోని కొస్తా భాగంలోనికి దూసుకెళ్తున్నాయి. నేడు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలకు అనుకూలంగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ పిడుగులు, వర్షాలు నేడు మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కొనసాగనున్నాయి. ఎప్పుడైతే వేడి తోడౌతుందో అప్పుడు మాత్రం ఈ వర్షాలుంటాయి. కానీ రాత్రికి భూమి చల్లబడుతుంది కాబట్టి వర్షాల జోరు తగ్గుముఖం పట్టనుంది. అలాగే మరో వైపున తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లోని పలు భాగాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలం. అర్ధరాత్రి సమయానికి బెంగళూరు - అనంతపురం బెల్ట్ లో గాలుల సంగమం ఏర్పడనుంది. దాని వలన పిడుగులు, వర్షాలు నేడు సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో అది కూడ కర్ణాటక సరిహద్దు భాగాల్లో ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


ఉత్తర భారతంలో వాతావరణం ఇలా..
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో వర్షం కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, గురువారం (ఏప్రిల్ 27) నుండి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరో రౌండ్ వర్షం కనిపించవచ్చు, దీని కారణంగా ఉష్ణోగ్రత తగ్గవచ్చు. రాబోయే మూడు రోజుల్లో తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత మూడు నుండి ఐదు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో, నార్త్ వెస్ట్ మరియు వెస్ట్ ఇండియాలో రాబోయే ఒకటి నుండి రెండు రోజుల వరకు గణనీయమైన మార్పు కనిపించదు. బిహార్, యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో ఈ సమయంలో వేసవి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని అంచనా వేశారు.