Ganesh Immersion 2024 in Annamayya: వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషుడి మండపాల వద్ద భక్తులు ఈ మధ్య కాలంలో సినిమా పాటలు అధికంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం మండపాల ఎదురుగానే సినిమా పాటలకు రికార్డింగ్ డాన్స్ లు కూడా ఏర్పాటు చేశారు. గణనాథుడి ఎదురుగానే యువతి యువకులు కుప్పి గంతులు చాలా విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు వేడుకల్లో మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కీర్తిస్తూ మైకులో పాటలు పెట్టడం మరింత వివాదాస్పదం అయింది. 


ఆ పాటలు పెట్టడం ద్వారా ప్రత్యర్థి వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు శనివారం కేసు పెట్టారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు బి. కొత్తకోటలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలను స్థానిక కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని స్థానిక పోకనాటివీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఊరేగింపు జరిగింది. ఈ నెల 13వతేదీన ప్రారంభమై స్థానిక జ్యోతి బస్టాండ్ కు యాత్ర చేరుకుంది. 


ఆ యాత్రలో నిర్వాహకులు భక్తి గీతాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అవి చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వీక్షిస్తున్నారు. ఇదే సమయంలో డీజే స్పీకర్ బాక్సుల నుంచి ‘కావాలి జగన్‌... రావాలి జగన్‌’ అంటూ పాటలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత కొంతసేపటికి వైఎస్ఆర్ సీపీకి చెందిన జెండాలను కూడా తమ ఆ పార్టీ సానుభూతిపరులు ప్రదర్శించారు. ఈ విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు గుర్తించి వెంటనే వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్


ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా.. వైఎస్ఆర్ సీపీ జెండాలను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. వెంటనే కలగజేసుకున్న పోలీసులు జగన్ పాటలను ఆపేయాలని ఆదేశించినా నిర్వహకులు వినలేదు. ఇదే అంశం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు వరకూ వెళ్లింది. ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించి మదనపల్లె డీఎస్పీ కొండల నాయుడు, ఇన్‌ఛార్జి సీఐ రాజా రమేష్‌లు శనివారం బి.కొత్తకోటకు చేరుకుని ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మాట్లాడారు. 


దేవుడి ఊరేగింపు సందర్భంగా రాజకీయ పార్టీలను జోక్యం చేయడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు స్థానిక విలేకరులతో మాట్లాడారు. వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన కమిటీ సభ్యుల్లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. భక్తి భావనతో నిర్వహించాల్సిన కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రస్తావన రావడం విచారకరం అని, ఇలాంటి తప్పులు జరగకుండా కమిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.