Telugu News: ఏపీలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా? అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను మార్చారని.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల స్పందించారు. 


గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారని షర్మిల అడిగారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాలని అన్నారు. ఈ మేరకు షర్మిల ఎక్స్ ద్వారా స్పందించారు.


‘‘రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు ? జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలి. 


ప్రైవేటీకరణ పై సమాధానం చెప్పాలి. కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని,  నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డు కి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.


ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు. కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు.మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి YCP సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే... ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్..ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి,ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.