సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్‌ను కలిశారు. సమావేశం తర్వాత వీరు ఇద్దరూ విశాఖపట్నంలో సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే పోరాడుతున్న వారితో చేతులు కలుపుతున్నానని లక్ష్మీ నారాయణ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం తాను చేస్తున్న పోరాటాన్ని కేఏ పాల్ అందరికీ వివరించారు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.


స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం డ్రామా ఆడుతోందని కేఏ పాల్ విమర్శించారు. తాను ప్రధాని, కేంద్రమంత్రుల్ని ఇరవై ముప్ఫై సార్లు కలిశానని పాల్ తెలిపారు. ఈ విషయంలో లక్ష్మీనారాయణకు మద్దతు స్తున్నానని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు 99 శాతం పనులు అన్ని పూర్తయ్యాయని అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఇప్పటిదాకా 37 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, మరో 18 వేల మంది భూములు ఇచ్చారని గుర్తు చేశారు. దీన్ని 3,500 కోట్లకు అమ్మేస్తున్నారని పాల్ తెలిపారు. చివరి నిమిషంలో తాను ఫైట్ చేసి ఆపానని అన్నారు. హైకోర్టు విచారణకు ముందే వారు ప్రైవేటీకరణ చేశారని అన్నారు. ప్రైవేటీకరణ ఆపేందుకు తాను, జేడీ కోర్టులకు వెళ్లామని, కోర్టులకు గౌరవం ఇవ్వట్లేదని, అదే విషయం సీజేఐ చంద్రచూడ్ కు కూడా తాను చెప్పానని పాల్ తెలిపారు.


కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో కేఏ పాల్ కు ఉన్న బంధాల వల్లే ప్రైవేటీకరణ ఆపడం కోసం తాను ఇక్కడికి వచ్చినట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. అందరూ కలిస్తే ప్రైవేటీకరణ ఆగుతుందని అనుకునే కలిశానని అన్నారు. ప్రైవేటీకరణ ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కలిసి పనిచేస్తానని అన్నారు. విశాఖ స్టీల్ కు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందని, దేశ వ్యాప్తంగా 122 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉందని మాజీ జేడీ తెలిపారు. 173 మిలియన్ టన్నులకు మన స్టీల్ కెపాసిటీ పెంచుకోవాలని ఆయన అన్నారు. సెయిల్ వద్ద ఉన్న స్టీల్ ప్లాంట్ల కెపాసిటీ పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఓ వైపు కేంద్రం చేతిలో ఉన్న సెయిల్ ను ప్రోత్సహిస్తూనే విశాఖ ఉక్కును అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ను కూడా సెయిల్ ఆధ్వర్యంలో ఉంచి ప్రోత్సహిస్తే 7.3 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులకు దీని సామర్థ్యం పెంచవచ్చని అన్నారు.


ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పాల్గొన్న లక్ష్మీ నారాయణ
విశాఖ ఉక్కు ఈఓఐ (Expression of Interest)కు ఇప్పటికే 22 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్లాంట్ నిర్వహణ కోసం మూలధనం, ముడి సరుకులకు మొదట నిధులు ఇచ్చి.. తర్వాత నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఈవోఐ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు సంస్థ తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ వేశారు. ఇదే సమయంలో ఆయన ఓ భిన్నమైన ఆలోచన కూడా చెప్పారు. 


క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూల ధనాన్ని సమీకరిస్తామని చెప్పారు. 8 కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో నెలా ఒక్కో 100 రూపాయలు ఇచ్చినా 800 కోట్ల రూపాయలు అవుతుందని తెలిపారు. అలాగే ముడి సరుకు సేకరించి ఇస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు కావాల్సింది నిధులు, ముడి సరుకు మాత్రమేనని తెలిపారు. నాలుగు నెలల పాటు ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే 3,200 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పారు. స్టీల్ ఫ్లాంట్ ఈఓఐ గడువును మరో 5 రోజులు పెంచుతూ నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 20వ తేదీ మధాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పాల్గొంటామని చెప్పినా ఇంత వరకూ దాఖలు చేయలేదు.