Vizag Steel Plant Issue: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు భగ్గుమంటున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న వారంతా ఉద్యమం మరింత ఉద్దృతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రాణాలు తెగించైనా కొట్టాడతామని చెబుతున్నారు. 


ఉద్యమ కార్యచరణలో భాగంగా ఇవాళ స్టీల్‌ప్లాంట్‌ నుంచి సింహాచలం అప్పన్న దేవస్థానం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. కార్మికులంతా పాదయాత్రగా వెళ్లి సింహాచల లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్నారు.  కేంద్రం విధానంలో మార్పు తెచ్చేలా వరంప్రసాదించాలని ఆ స్వామిని వేడుకోనున్నారు. 


అధికారుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరించారు. కేంద్రం దిగిరాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ఏప్రిల్‌ 25న విశాఖ ఉక్కు సీఎండీ బంగ్లాను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ లోపు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కేంద్రం చెప్పాలని... ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి పంపాలని సీఎండీకి కార్మికులు సూచించారు. 
గత వారం రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ రకరకాల టర్న్‌లు ట్విస్ట్‌లు తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రి విశాఖలో పర్యటిస్తూ చేసిన ప్రకటన ఈ గందరగోళానికి దారి తీసింది. ప్రైవేటీకరణ ఆపుతున్నట్టు ఆయన చేసిన ప్రకటనతతో ఒక్కసారిగా అంతా ఆనంద పడ్డారు. రాజకీయ పార్టీలు కూడా తమ విజయమే అంటూ విజయోత్సవాలకు రెడీ అయ్యాయి. 


ఈ ప్రకటన వచ్చి 24 గంటల కాక ముందే కేంద్రం అందరి గాలి తీసేసింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయంలో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనకు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. ఈ ప్రచారంపై కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.


పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందన్న కేంద్రం


స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని కేంద్రం తెలిపింది.       


విశాఖలోనే మాట మార్చిన  కేంద్రమంత్రి ఫగన్ సింగ్                


గురువారం ఉదయం ప్రైవేటీకరణ లేదని చెప్పిన కేంద్ర మంత్రి సాయంత్రానికి మాట మార్చారు.  తాను స్టీల్ ప్లాంట్ ( RINL ) ను లాభాల బాట పట్టించే మార్గాలపై  దృష్టి  పెట్టామని మాత్రమే చెప్పానని ప్రవేటీకరణ రద్దు అంశం తన పరిధి లోనిది కాదని స్పష్టం చేసారు . పైగా కేంద్ర సహాయ మంత్రినైన తాను కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎలా మాట్లాడుతానని ప్రత్యేకంగా కార్మిక నేతలను పిలిపించుకుని మరీ చెప్పారు.   కేవలం ఉద్యోగ ,కార్మిక సంఘాల అభిప్రాయాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకు వెళతానని వారికి చెప్పారు . దానికి కొనసాగింపుగాకేంద్రం.. పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది.