తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ కనిపిస్తోంది. ఏపీలో ఎండలు దంచికొడుతుంటే... తెలంగాణలో వాతావరణం కాస్త కూల్ అయింది. హైదరాబాద్‌లో సహా పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో మాత్రం వడగాల్పులు కాకరేపుతున్నాయి. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ అంచనాల ప్రకారం ఇవాళ(శనివారం) 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు,  115 మండలాల్లో వడగాల్పులు, రేపు (ఆదివారం) 65 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 


ఇవాళ తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (12)  
అనకాపల్లి జిల్లా :- కె. కోటపాడు, మాకవరపాలెం,నర్సీపట్న, నాతవరం
కాకినాడ జిల్లా :- కోటనందూరు
మన్యం జిల్లా :- గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మవలస,కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం 






రేపు(ఆదివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(115) 


అల్లూరిసీతారామరాజు జిల్లా- 7 మండలాలు 
అనకాపల్లి- 13 మండలాలు 
తూర్పుగోదావరి- 10 మండలాలు 
ఏలూరు - ఒక మండలం 
గుంటూరు - 6  మండలాలు 
కాకినాడ- 16 మండలాలు 
కోనసీమ- 6 మండలాలు 
కృష్ణా - 2 మండలాలు 
ఎన్టీఆర్ జిల్లా -  4 మండలాలు 
పల్నాడు- 3 మండలాలు 
పార్వతీపురం మన్యం - 7 మండలాలు 
శ్రీకాకుళం - 13  మండలాలు 
విశాఖపట్నం - 3 మండలాలు 
విజయనగరం - 24 మండలాలు 


ఈ మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శుక్రవారం అనకాపల్లి 10, కాకినాడ 2,  ఎన్టీఆర్ 1 మండలంలో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని  విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.   


ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్ర అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగినంత స్థాయిలో నీరు తాగాలని సూచించారు. బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా ముఖ్యమైన పనులుంటే సాయంత్రం వేళలు మాత్రమే బయటకు వెళ్లాలని పేర్కొన్నారు. 






తెలంగాణలో వర్షాలు 
తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణపై ఉంది. అందుకే సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లోఅలెర్ట్ జారీ చేసింది. 


ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిచే అవకాశం కూడా ఉంది. ఈ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయి. 41 నుంచి 43 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు కావచ్చని తెలిపింది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది.