Bike Riders in Vizag: స్మార్ట్ సిటీ వైజాగ్ లో బైక్ రైడర్స్ రెచ్చిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు బీచ్ రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై ప్రమాదకర స్టంట్ లు చేస్తూ సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవలే యువకులు స్టంట్ చేస్తుండగా అటుగా వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ అతడిని అడ్డుతప్పుకోమ్మని చెప్పాడు. కోపోద్రిక్తుడైన బైక్ రైడ్.. ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి చేయడం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. దానితో రంగంలోకి దిగిన పోలీసులు ఇలాంటి రైడర్స్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే వైజాగ్ త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 85 మంది బైక్ రైడర్స్ ను అదుపులోకి తీసుకున్నారు . వీరిలో 30 మంది విద్యార్థులు ఉండడంతో పోలీసులు వారిని తీవ్రంగా హెచ్చరించారు. ఎడ్యుకేషనల్ సిటీగా పేరొందిన విశాఖ నగరంలో ఇలాంటి పోకడలు ఎప్పుడూ లేవనీ.. అనుమతి లేని బైక్ రేసింగ్ లలో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవద్దని వైజాగ్ (ఈస్ట్ ) ఏసీపీ హర్షిత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.


73 ద్విచక్రవాహనాలు స్వాధీనం..


విశాఖ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ అంశం పై ప్రత్యేక దృష్టి పెట్టారని.. యువకులు బైక్ రైడింగ్ లు, ప్రమాదకర స్టంట్లు చేస్తూ కేసుల్లో ఇరుక్కొని జీవితాలను పాడు చేసుకోవద్దని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 73 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు చెప్పారు. ఇలాంటి స్టంట్స్ మాత్రమే కాక, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని సైతం గుర్తించి ఎక్కడిక్కడ వారిని ఆపుతున్నామని, సమీప పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నామని వివరించారు . అలాగే బైక్ రైడర్స్ కు, వారి తల్లితండ్రులకు కూడా పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. 


వాట్సాప్ గ్రూపులపై పోలీసుల ప్రత్యేక దృష్టి..


విశాఖలోని బైక్ రైడర్స్ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారానే.. ప్రమాదకర స్టంట్లకు సంబంధించిన మెసేజ్ లు పంపించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే నగరంలోని వాట్సాప్ గ్రూపులపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.  అలాగే రాత్రి పూట బైక్ తీసుకుని బయటికి వెళుతున్న మపిల్లలను ఎక్కడికి వెళుతున్నారు, ఏం పని ఉందో తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. లేకపోతే వాళ్లు అరెస్టయినా, ఏదైనా ప్రమాదంలో పడినా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. పిల్లలు ఏం చేస్తున్నారే దానిపై తల్లితండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. యువత బాధ్యతాయుతంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించాలని హితవు పలికారు. నగరంలో బైక్ స్టంట్స్ కూ ,ర్యాష్ రైడింగ్ లకూ అనుమతి లేదన్న పోలీసులు ఇదే పద్దతి కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.