చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవడమో, లేక హత్యలు చేసి హంతకులుగా మారుతున్న కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సరిగ్గా విశాఖలో ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. విశాఖలోని అల్లిపురంలో జరిగిన పెయింటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణం వెల్లడైంది. కేవలం తన తల్లిని తిట్టాడని పెయింటర్ శ్రీనును హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. 


పోలీసుల కథనం ప్రకారం... అల్లిపురం వద్ద గొంతిన శ్రీను అనే 45 ఏళ్ల  వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద అమ్మాయికి పెళ్లి కాగా రెండో అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. భార్య ఇళ్లల్లో పాచిపని చేస్తుంది. కొన్నేళ్ల కిందట శ్రీను మద్యానికి అలవాటు పడ్డాడు. తాగుటు అలవాటుతో ఇంట్లో గొడవలు, బయట సైతం తరచు గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో ఎలైట్ జంక్షన్ వద్ద కూలి పనులకోసం ప్రతీ రోజూ ఉదయం నిలబడతాడు. ఎవరు వచ్చి పనికి పిలిస్తే వారితో వెళుతుంటాడు.


మహిళను చూసి అసభ్య ప్రవర్తన.. 
ఆదివారం సైతం పని కోసం ఎదురుచూస్తూ జంక్షన్ వద్ద నిల్చున్నాడు పెయింటర్ శ్రీను. ఆ సమయంలో అటుగా వెళుతున్నబియ్యా  గౌరి  అనే మహిళను చూసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా తనతో రమ్మంటూ మరింత దిగజారి మాట్లాడాడు. పెయింటర్ చేష్టలతో గౌరి కోప్పడింది. తనకు ఎదురుచెప్పడంతో ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. వాగ్వివాదం గొడవకు దారితీసింది.


సర్ది చెప్పిన స్థానికులు.. కానీ 
అక్కడే ఉన్న కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి , సిమెంట్ షాపులో పనిచేసే మరో వ్యక్తి వారిద్దరికి సర్దిచెప్పి గొడవ విడదీశారు. దాంతో గౌరి, పెయింటర్ శ్రీను ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే తనకు జరిగిన అవమానం, పెయింట్ అసభ్య ప్రవర్తన గురించి తన కుమారుడు బియ్యా ప్రసాద్ కు గౌరి ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలియగానే బైకు మీద తల్లిని తీసుకుని అక్కడకు వచ్చాడు బియ్యా ప్రసాద్. పెయింటర్ శ్రీనుపై తల్లికొడుకులు దాడికి పాల్పడ్డారు. 


తల్లీకొడుకులు కలిసి తనపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన శ్రీను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న సందులోకి పారిపోయినా, వీళ్లు అతడ్ని వదల్లేదు. ఎలాగోలా పెయింటర్ శ్రీనును వెంబడించి పట్టుకుని.. అతడి ముఖంపై ఇటుక రాయితో పదేపదే కొట్టారు. అతడి తలపై సైతం ఇటుకతో దాడి చేసి, అక్కడినుండి మెయిన్ రోడ్డు పైకి లాక్కొచ్చారు. లాడ్జి ఎదురుగా పడేసి దాడిచేస్తూ శ్రీను చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత  తల్లీ కొడుకులు బైక్ పై పరారు అయ్యారు . ఈ ఘటన అంతా  అక్కడి సీసీ టీవీల్లో రికార్డు అయింది . ఈ ఘటన వైజాగ్ లో సంచలనం సృష్టించింది.


స్థానికుల సమాచారంతో రంగంలోకి పోలీసులు.. 


అనుమానాస్పద మరణం గురించి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలతో దర్యాప్తు చేసి ఆదివారం సాయంత్రం తల్లీ కొడుకులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో చనిపోయిన శ్రీనుకీ , హంతకులకీ మధ్య ఎలాంటి పాత గొడవలు లేవని తేలింది. అయితే ఆదివారం ఉదయం తన తల్లిని దూషించాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగానే పెయింటర్ శ్రీనును హత్య చేసినట్లు బియ్యా ప్రసాద్ అంగీకరించాడు.